Jio IPO | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రూ.7.40 లక్షల కోట్ల (100 బిలియన్ల డాలర్లు) విలువ గల ఐపీవోకు వెళ్లనున్నది. ఒకవేళ జియో ఐపీవోకు వెళితే.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తర్వాత జియో ఐపీవో అతి పెద్దది కానున్నది.
ఈ ఏడాదిలో జియో ఐపీవో లిస్టవుతుందని ఫారిన్ బ్రోకరేజ్ హౌస్ సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. 2020లో 33 శాతం వాటాలను 13 మంది ఇన్వెస్టర్లకు లేదా ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు విక్రయించింది. ఇందులో ఫేస్బుక్కు 10 శాతం, గూగుల్కు 8 శాతం వాటాలను విక్రయించింది. దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం కంపెనీ జియో. 2021 అక్టోబర్ నాటికి జియోకు 42 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.
2020లో జియోలో తన వాటాలను విక్రయించడం ద్వారా రిలయన్స్ రూ.1.52 లక్షల కోట్ల నిధులు సేకరించింది. గూగుల్, ఫేస్బుక్ కలిసి రూ.77,311 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. రిటైల్ విక్రయాల్లో రూ.47 వేల కోట్ల నిధులు సేకరించింది. సీఎస్ఎల్ఏ అంచనా ప్రకారం జియో విడిగా ఐపీవోకు వెళుతుందని, దాని విలువ 99 బిలియన్ల డాలర్లు ఉంటుందని తెలుస్తున్నది. ఈ నెలాఖరు నాటికి జియో సబ్స్క్రైబర్లు 43 కోట్లు దాటతారు. ఎయిర్టెల్కు 32 కోట్ల మంది ఉంటారు. ఎయిర్టెల్ ప్రతి సబ్స్క్రైబర్ నుంచి రూ.157 , జియో రూ.144 సంపాదిస్తోంది.