5G Service | దేశంలో ఒకవైపు ఇంటర్నెట్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. 4జీ, 5జీ అంటూ టెలికం సంస్థలు తమ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అయినప్పటికీ 2జీ, 3జీ సర్వీసులు వాడేవాళ్లు దేశంలో చాలానే ఉన్నారు. గ్రామాలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పెద్దవాళ్లు ఇంకా ఫీచర్ ఫోన్లనే వాడుతున్నారు. అందులో 2జీ సేవలనే వినియోగించుకుంటున్నారు. అయితే అలాంటి వాళ్లకు షాక్ ఇచ్చేందుకు జియో, వొడాఫోన్ ఐడియా సిద్ధమయ్యాయి. 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా 2జీ, 3జీ సేవలు అందించడం అవసరం లేదని.. వాటిని పూర్తిగా నిలిపివేయాలని తాజాగా టెలికం నియంత్రణ సంస్థ ( ట్రాయ్)కు ప్రతిపాదించాయి. దీనికి సంబంధించి కేంద్రమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచించాయి.
2జీ/3జీ సేవలను పూర్తిగా నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ట్రాయ్కు జియో కోరింది. ఆ రెండు స్పెక్ట్రమ్లను మూసివేసినప్పుడే ప్రజలంతా 4జీ, 5జీలోకి మారతారని అభిప్రాయపడింది. దీనివల్ల అనవసరపు నెట్వర్క్ వినియోగ భారం తగ్గుతుందని వివరించింది. అంతేకాకుండా 5జీ ఎకో సిస్టమ్ వృద్ధిలో వేగవంతమవుతుందని తెలిపింది. వివిధ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో 5జీ ఎకోసిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని జియో అభిప్రాయపడింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ద్వారా యువతలో నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు తమ కలలను సాకారం చేసుకునేందుకు అవకాశాలను ఇస్తాయని పేర్కొంది.
ఇప్పటికీ పాతకాలపు 2జీ నెట్వర్క్ను ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా ఉందని వొడాఫోన్ ఇండియా పేర్కొంది. 4జీ, 5 జీ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది ఆ సేవలను వినియోగించుకోలేకపోతున్నారని తెలిపింది. అధునాతన కలిగిన స్మార్ట్ఫోన్ వినియోగించే సామర్థ్యం లేకపోవడం అలాగే వాటికి కొనే స్తోమత లేకపోవడంతో చాలామంది పాతకాలపు టెక్నాలజీనే వాడుతున్నారని తెలిపింది. ఇది పౌరుల మధ్య డిజిటల్ విభజనను తీసుకొస్తుందని అభిప్రాయపడింది.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వృద్ధులు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తుండటంతో వారంతా 4జీ, 5జీకి మారాలంటే తమ ఫోన్లను మార్చాల్సి ఉంటుంది. కొత్త హ్యాండ్సెట్ కొనడం కోసం కనీసం 5 నంచి 10 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది కాకుండా స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ రాని వృద్ధులు కూడా చాలామందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2జీ, 3జీ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడం సాధ్యమయ్యే పనేనా? అని ఒక వాదన కూడా వినిపిస్తుంది.