న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఆసియాలో అత్యంత శ్రీమంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా ప్రపంచ ఐశ్యర్యవంతుల్లో అగ్రస్థానంలో ఉన్న అమేజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెస్లా మోటార్స్ అధినేత ఎలాన్ మస్క్ల సరసన స్థానం సంపాదించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు శుక్రవారం రికార్డు గరిష్ఠం రూ.2,680 వద్ద ముగిసింది. దీంతో బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీ సంపద 100.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.52 లక్షల కోట్లు) చేరింది. ఈ ఏడాది ఇప్పటికే అంబానీ సంపద 23.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానం
బెజోస్, మస్క్లతో పాటు 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ఇప్పటికే 10 మంది శ్రీమంతులున్నారు. తాజాగా 11వ స్థానంలోకి ముకేశ్ వచ్చారు. ప్రస్తుత బ్లూంబర్గ్ ఇండెక్స్ డేటా ప్రకారం ప్రపంచ ఐశ్యర్యవంతుల జాబితాలో ప్రధమస్థానంలో 222 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ ఉన్నారు. ద్వితీయస్థానంలో ఉన్న బెజోస్ సంపద 191 బిలియన్ డాలర్లు. ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టరు వారెన్ బఫెట్ 103.8 బిలియన్ డాలర్ల సంపదతో పదో స్థానంలో ఉన్నారు.