న్యూఢిల్లీ, జూన్ 13: ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని 2000 అతిపెద్ద కంపెనీల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్లో ఉన్నది. గత ఏడాదితో పోల్చితే 8 ర్యాంకులు ఎగబాకి అంతర్జాతీయంగా 45వ స్థానం దక్కించుకున్నది. దేశీయంగా మాత్రం 109.43 బిలియన్ డాలర్ల అమ్మకాలు, 8.3 బిలియన్ డాలర్ల లాభంతో అగ్రస్థానంలో నిలిచిందీ ముకేశ్ అంబానీ సంస్థ. బీఎండబ్ల్యూ, నెస్లే, అలీబాబా, పీఅండ్జీ, సోనీ వంటి బడా గ్లోబల్ కంపెనీల ర్యాంకులు రిలయన్స్ కంటే వెనుకే ఉండటం గమనార్హం. ఇక భారతీయ సంస్థల్లో రిలయన్స్ తర్వాత రెండో స్థానంలో ఎస్బీఐ, మూడో స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అమెరికా బ్యాంక్ జేపీమోర్గాన్ ఉన్నది. సౌదీ ఆరామ్కో రెండో స్థానంలో ఉండగా, తర్వాతి మూడు స్థానాల్లో చైనా ప్రభుత్వ బ్యాంకులే ఉండటం విశేషం.