Reliance | కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభాల్లో 9.3 శాతం గ్రోత్తో రూ.17,265 కోట్లకు పెంచుకున్నది. మార్కెట్ వర్గాలు రూ.16,944 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి.
ఆపరేషన్ల ద్వారా రిలయన్స్ కన్సాలిడేటెడ్ రెవెన్యూలో 3.6 శాతం గ్రోత్ తో రూ.2.28 లక్షల కోట్లకు చేరుకున్నది. అయితే మార్కెట్ వర్గాల అంచనా రూ.2.36 లక్షల కోట్ల కంటే తక్కువగా రెవెన్యూ గడించింది. కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ కాస్ట్ 11 శాతానికి పైగా పెరిగి రూ.5,789 కోట్లకు చేరింది. క్యాపిటల్ వ్యయం రూ.30,102 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ.38,815 కోట్లు. 2022-23 డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ రుణాలు రూ.3.03 లక్షల కోట్లు కాగా, గత సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2.96 లక్షల కోట్లు.. డిసెంబర్ త్రైమాసికంలో అది రూ.3.12 లక్షల కోట్లకు చేరుకున్నది.
జియో ప్లాట్ ఫామ్స్ నికర లాభం సుమారు ఆరుశాతం పెరిగి రూ.5,445 కోట్లకు పెరిగింది. రెవెన్యూ, ఈబీఐటీడీఏ విభాగాల్లో 11 శాతం గ్రోత్తో రూ.32,510 కోట్లు, రూ.13,955 కోట్ల వ్రుద్ధి నమోదైంది. నిర్వహణ లాభాలు 50.3 శాతం నుంచి 50.4 శాతానికి పెరిగాయి. రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్ల బేస్ 459.7 మిలియన్ల నుంచి 470.9 మిలియన్లకు పెరిగింది. ‘ప్రపంచ దేశాల్లోకెల్లా భారత్లో శరవేగంగా జియో 5జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి తెచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను’ అని రిలయన్స్ సీఎండీ ముకేశ్ డీ అంబానీ చెప్పారు.