న్యూఢిల్లీ, జూలై 17 : చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.20,946 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదుచేసుకున్నది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.26,994 కోట్ల లాభంతో పోలిస్తే 22 శాతం తగ్గుదల నమోదు చేసుకున్నది. ఏషియన్ పెయింట్స్లో షేర్లను విక్రయించడంతో ఒకేసారి భారీగా రూ.8,942 కోట్ల ఆదాయం సమకూరడంతో గతేడాది రికార్డు స్థాయి లాభాలను ఆర్జించిది సంస్థ. చమురు నుంచి కెమికల్స్, టెలికాం రంగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే ఈ మాత్రమైన లాభాలను నమోదు చేసుకున్నట్టు వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 24.5 శాతం అధికమై రూ.3,40,257 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అంచనాలకుమించి రాణించింది. జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,764 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.7,110 కోట్ల లాభంతో పోలిస్తే 9.2 శాతం వృద్ధిని కనబరిచింది. మార్కెట్ వాటా పెరగడం, కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం అధికమవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11.8 శాతం అందుకొని రూ.39,173 కోట్లకు చేరుకున్నది. సరాసరిగా ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం 3.3 శాతం అధికమై రూ.215.6కి చేరుకోవడం కంపెనీకి కలిసొచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థకు 53.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. డిజిటల్ కామర్స్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఇతర రంగాలు నేలచూపులు చూస్తున్నదని, ముఖ్యంగా రిటైల్ రంగంలో వృద్ధి ఫ్లాట్గా ముగిసినట్టు పేర్కొంది.
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. దేశంలో అతిపెద్ద ఐపీవోలలో ఇది కూడా ఒకటికానున్నది.
– ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్