న్యూఢిల్లీ, జూలై 11: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణ గ్రహితలకు శుభవార్తను అందించింది. ఒకవైపు అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతుండగా, బీవోఎం మాత్రం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 0.35 శాతం వరకు తగ్గించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ 7.70 శాతం నుంచి 7.50 శాతానికి దిగొచ్చింది. అలాగే ఆరు నెలలు కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు తగ్గడంతో రేడు 7.40 శాతానికి దిగింది. దీంతోపాటు మూడు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ని 0.35 శాతం తగ్గించడంతో వడ్డీరేటు 7.20 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఒక్కరోజు, నెల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని పావు శాతం తగ్గించడంతో రుణ రేటులు వరుసగా 6.90 శాతం, 7 శాతానికి తగ్గాయి.