న్యూఢిల్లీ, జూలై 16: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విమాన ఇంధన ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడంతో జెట్ ఫ్యూయల్ ధరలను 2.2 శాతం వరకు తగ్గించాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ధర రూ.3,084.94 లేదా 2.2 శాతం తగ్గి రూ.1,38,147.93కి దిగొచ్చింది. ఈ ఏడాది ధరలు తగ్గించడం ఇది రెండోసారి కాగా, 11 సార్లు ధరలు పెంచాయి చమురు సంస్థలు. జూన్1న కిలో లీటర్ ధరను 1.3 శాతం తగ్గించిన విషయం తెలిసిందే.
గత నెల చివర్లో రికార్డు స్థాయి రూ.1,41,232.87కి చేరుకున్నది. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1, 16న దేశీయంగా ఏటీఎం ధరల్లో మార్పులు చేస్తుంటాయి సంస్థలు. పలు దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నట్లు వచ్చిన సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు జెట్ ఫ్యూయల్ ధర 91 శాతం(కిలో లీటర్పై రూ.67,210.46) చొప్పున పెంచిన సంస్థలు..ఈసారి ధరలు తగ్గించడం విశేషం.