న్యూఢిల్లీ, జూలై 27: 5జీ స్పెక్ట్రం వేలం రెండో రోజు టెలికం సంస్థల జోష్ తగ్గింది. బుధవారం కేవలం రూ.4వేల కోట్ల విలువైన బిడ్లే దాఖలయ్యాయి. మంగళవారం ఈ వేలం మొదలవగా.. రికార్డు స్థాయిలో 1.45 లక్షల కోట్ల బిడ్లు వచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, అదానీ గ్రూప్, వొడాఫోన్ ఐడియాలు ఈ వేలంలో పాల్గొంటున్నాయి. కాగా, తొలిరోజు 4 రౌండ్లు జరగగా, మలిరోజు 5 రౌండ్లు జరిగాయి. ఈ రెండు రోజుల్లో మొత్తం 9 రౌండ్లు జరగగా, రూ.1,49,454 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయని టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గురువారం కూడా స్పెక్ట్రం బిడ్డింగ్ కొనసాగుతుందన్నారు.
నిజానికి మొదటి రోజు వచ్చిన స్పందనను చూసి రెండో రోజే వేలం ముగిసిపోతుందన్న అంచనాలు ప్రభుత్వ వర్గాల్లో వెల్లువెత్తాయి. అయితే ఊహించనివిధంగా రూ.4వేల కోట్ల బిడ్లే వచ్చాయి. ఇదిలావుంటే జియో రూ.80,100 కోట్లు, ఎయిర్టెల్ 45,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా 18,400 కోట్లు విలువైన బిడ్లు వేసి ఉండవచ్చన్న అంచనాలున్నాయి. ఈసారి వేలంలో రూ.4.3 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను కేంద్రం అమ్మకానికి పెట్టింది. హైఫ్రీక్వెన్సీ బ్యాండ్ 26 గిగాహెట్జ్తోపాటు మధ్యశ్రేణి బ్యాండ్ 3300 మెగాహెట్జ్, లోఫ్రీక్వెన్సీ బ్యాండ్లు 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగాహెట్జ్ తరంగాలకూ ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది.