న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఎంట్రీ లెవల్ ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఫాడా కోరుతున్నది. ఈ విషయంపై బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకొని జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కోరారు. 100 నుంచి 125 సీసీ ద్విచక్ర వాహనాలపై అధికంగా జీఎస్టీని విధిస్తున్నారని, దీనిని తగ్గించాలని గడ్కరీకి అందించిన లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో 75 శాతం వాటా వీటివని, కరోనా తర్వాత వీటి అమ్మకాలు 20 శాతం వరకు పడిపోయాయని ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. 2047 నాటికి 47 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ అవతరించడానికి ఆటోమొబైల్ రంగం కూడా చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఎంట్రీ-లెవల్ ద్విచక్ర వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని, అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంటుందన్నారు.