India | న్యూఢిల్లీ, జనవరి 8: ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్గించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 2022-23లో భారత్ నుంచి 451 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. అయితే ఈ 2023-24లో 421 బిలియన్ డాలర్లకే పరిమితం కావచ్చని రిసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ఐఎస్) చెప్తున్నది. దీంతో 30 బిలియన్ డాలర్ల (రూ.2.50 లక్షల కోట్లు) వరకు పడిపోవచ్చని తెలుస్తున్నది. ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకలకు హౌతీ మిలిటెంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో కంటైనర్ షిప్పింగ్ రేట్లు అమాంతం పెరిగాయి.
అంతేగాక ప్రయాణ ఖర్చులు, కంటైనర్లలోని సరకులకు సంబంధించిన బీమా ప్రీమియంలూ భారంగా తయారయ్యాయి. దీంతో ఎగుమతిదారులు వెనుకడుగు వేస్తున్నట్టు ఆర్ఐఎస్ డైరెక్టర్ సచిన్ చతుర్వేది చెప్తున్నారు. ఇప్పటిక భారతీయ ఎగుమతిదారులు 25 శాతం ఎగుమతుల్ని ఆపేసినట్టు దేశీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ఇక గత నెల ప్రథమార్ధంతో పోల్చితే ఇప్పుడు ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే నౌకలు దాదాపు 44 శాతం తగ్గాయని ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బ్రోకర్ క్లార్క్సన్ రిసెర్చ్ గుర్తుచేస్తున్నది. సరకు రవాణా సామర్థ్యం కూడా 40 లక్షల టన్నుల నుంచి 25 లక్షల టన్నులకు తగ్గిందంటున్నది.
ఎర్ర సముద్రంలో ఏం జరుగుతోంది?
ఇరాన్ అండదండలతో రెచ్చిపోతున్న హౌతి తిరుగుబాటుదారులు.. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఎర్ర సముద్రంలో నౌకలపై విరుచుకుపడుతున్నారు. ఆసియా, ఐరోపా దేశాల మధ్య వర్తక, వాణిజ్యానికి వీలుగా హిందూ మహాసముద్రం, మెడిటరేనియన్ సముద్రం నడుమ ఉండే వారధే ఈ ఎర్ర సముద్రం. దీనికి ఒక చివరన సూయెజ్ జలసంధి ఉంటే.. మరో చివరన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి. 30 కిలోమీటర్ల వెడల్పుండే ఈ బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలోనే నిరుడు నవంబర్లో కనీవినీ ఎరుగని రీతిలో ఓ నౌకను హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఏకంగా హెలీక్యాప్టర్ ద్వారా నౌకపై దిగి, తమ అధీనంలోకి సదరు షిప్ను తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గం గుండా మార్స్, హపాగ్-లాయిడ్ వంటి అగ్రశ్రేణి షిప్పింగ్ కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేశాయి. మరికొన్ని కంటైనర్ల ధరల్ని బాగా పెంచి నడిపించే సాహసం చేస్తున్నాయి. ఈ పరిణామం యావత్తు ఆసియా-ఐరోపా ట్రేడింగ్ను ప్రభావితం చేస్తున్నది. ప్రపంచ వాణిజ్యంలో ఈ మార్గం గుండా జరిగే ఎగుమతి-దిగుమతుల వాటా 12 శాతంగా ఉన్నది. కాగా, నిజానికి మొదట్లో ఇజ్రాయెల్ నౌకలనే హౌతీ రెబల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత అన్ని నౌకలపైనా క్షిపణులతో దాడులకు తెగబడుతున్నారు.
భారత్కు వచ్చిన నష్టమేమిటి?
హౌతి తిరుగుబాటుదారుల దుశ్చర్యతో హిందూ మహాసముద్రంలో భాగమైన అరేబియా సముద్రం ద్వారా భారత్ నుంచి ఐరోపా, అమెరికా ఈస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు జరిగే వాణిజ్యం ఇబ్బందుల్లో పడింది. మెడిటరేనియన్ సముద్ర తీరంలోని ఆయా దేశాలకు బాబ్ ఎల్-మండేబ్ జలసంధి ద్వారా ఎర్ర సముద్రం మీదుగా సూయెజ్ జలసంధి నుంచే భారతీయ ఎగుమతులు చేరుతున్నాయి. అలాంటిది బాబ్ ఎల్-మండేబ్ జలసంధిపై హౌతి తిరుగుబాటుదారుల దాడులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఈ రూట్కు ప్రత్యామ్నాయం.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి వెళ్లడమే. ఇలా వెళ్తే 6వేల కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. అదనంగా 10 రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు మరో 10 లక్షల డాలర్లదాకా ఇంధన ఖర్చు అవుతుంది.
ఈ క్రమంలో బీమా వ్యయం కూడా భారంగానే తయారవుతుంది. ఇక ఇదే మార్గం గుండా భారత్కు ముడి చమురు దిగుమతులూ జరుగుతున్నాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, భారత్కు వస్తున్న క్రూడాయిల్ నౌకలపై హౌతి రెబల్స్.. డ్రోన్లతో దాడులు జరిపారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉన్నది. మరోవైపు హౌతి రెబల్స్ను అడ్డుకునేందుకు సౌదీ అరేబియాతో కలిసి అమెరికా సైన్యం రంగంలోకి దిగవచ్చన్న సమాచారం కూడా ఉన్నది. ఇదే జరిగితే పరిస్థితులు ఇంకే వైపు మళ్లుతాయోనన్న ఆందోళనలు వ్యాపార వర్గాల్లో ఉన్నాయి.