న్యూఢిల్లీ: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే భారత్ ఎకానమీ కోలుకుంటుందా.. జీడీపీ పరుగులు తీస్తుందా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో జీడీపీ వృద్ధి చాలా బాగుంది. కరోనా రెండో వేవ్ తర్వాత ఈ ఏడాది జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 20.1 శాతం పెరిగింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక రికార్డు. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మార్చితో ముగిసిన త్రైమాసికంలో కేవలం 1.6 శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది. గతేడాది తొలి త్రైమాసికంలో మైనస్ 24.4 % గ్రోత్ రేట్ నమోదు కావడం గమనార్హం
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సైతం జూన్ త్రైమాసికంలో జీడీపీ 21.4 శాతం వృద్ధి చెందొచ్చునని అంచనా వేసింది. మొత్తం జీడీపీ విలువ 30.1 లక్షల కోట్లు. రంగాల వారీగా నిర్మాణ రంగంలో 68.3 శాతం గ్రోత్ రికార్డైంది. ఉత్పాదక రంగంలో 49.6 శాతం, మైనింగ్ సెక్టార్లో 18.6 శాతం జీడీపీ నమోదైంది.
ఇదిలా ఉంటే ఏప్రిల్-జూలై మధ్య ద్రవ్యలోటు 21.3 శాతానికి చేరుకున్నది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మొత్తంతో సమానం. తొలి నాలుగు నెలల్లో ద్రవ్యలోటు రూ.3.21 లక్షల కోట్లు. పన్ను వసూళ్లు రూ. 5.21 లక్షల కోట్లయితే, ఖర్చు చేసిన మొత్తం రూ. 10.03 లక్షల కోట్లు.