న్యూఢిల్లీ, జనవరి 2: గత నెల ఆన్లైన్ పేమెంట్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు డిసెంబర్లో రూ.12.82 లక్షల కోట్లను తాకాయి. మొత్తం 782 కోట్ల లావాదేవీలు జరిగినట్టు సోమవారం ఆర్థిక సేవల శాఖ ట్వీట్ చేసింది. 2016లో యూపీఐ మొదలైన విషయం తెలిసిందే. ‘దేశీయ డిజిటల్ చెల్లింపుల విప్లవంలో యూపీఐదే కీలకం. నిరుడు డిసెంబర్లో యూపీఐ లావాదేవీల సంఖ్య 782 కోట్లను చేరింది.
వీటి విలువ రూ.12.82 లక్షల కోట్లు’ అని ఆర్థిక సేవల శాఖ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. యూపీఐ లావాదేవీలపై ఎటువంటి చార్జీలు లేవు. మొబైల్స్ ద్వారా సులభంగానే జరుపవచ్చు. ప్రభుత్వాలు, బ్యాంకర్లు ప్రోత్సహిస్తుండటంతో ఈ లావాదేవీలకు ఆదరణ పెరుగుతున్నది.