న్యూయార్క్, జూన్ 18: గ్లోబల్ ఇన్వెస్టింగ్ దిగ్గజం, అగ్రశ్రేణి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్తో మధ్యాహ్న భోజన అవకాశం.. ఓ వేలంలో ఏకంగా రూ.148 కోట్లపైనే పలికింది. ఛారిటీ కోసం శుక్రవారం రాత్రి జరిగిన ఈబే యాక్షన్లో ఒకరు ఈ ఛాన్స్ను 19 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు మరి. అయితే ఎవరనేది తెలియాల్సి ఉన్నది. గతంతో పోల్చితే ఈ మొత్తం నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 43 మంది పోటీపడ్డారు. ఇంతకుముందు 20సార్లు ఈ తరహా వేలాలు జరగగా, ఇది 21వది, చివరిది కూడా. 2019లో ఆఖరిసారిగా బఫెట్తో లంచ్ ఆఫర్ను వేలం వేశారు.
అప్పుడు 4.5 మిలియన్ డాలర్లు పలికింది. కాగా, శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో పేదరిక నిర్మూలన కోసం శ్రమిస్తున్న ఓ నాన్-ప్రాఫిట్ సంస్థ ైగ్లెడ్కు సాయం కోసం ఈ వేలాలు వేస్తున్నారు. 2000వ సంవత్సరం నుంచి ఏటా జరుగుతుండగా, కరోనాతో విరామం వచ్చింది. ఇప్పటిదాకా ఈ వేలాల్లో 34.5 మిలియన్ డాలర్లను సేకరించారు. ఈసారి విజేతగా నిలిచినవారు న్యూయార్క్లోని స్మిత్ అండ్ వొలెన్స్కీలో 91 ఏండ్ల బఫెట్తో ‘పవర్ లంచ్’ చేయనున్నారు. బఫెట్కు నచ్చిన రెస్టారెంట్లలో ఇదొకటి. గంటపాటు జరిగే ఈ లంచ్ సందర్భంగా బఫెట్ నుంచి పెట్టుబడి మెలకువలు, జీవిత పాఠాలు విజేతలు తెలుసుకుంటారు.