RDE Rules Effect on Vehicles | కాలుష్యంతో రోజురోజుకు ముంచుకొస్తున్న పర్యావరణం ముప్పు.. దాని నివారణకు నడుం బిగించిన ప్రపంచ దేశాలు.. నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా భారత్ సైతం అడుగులేస్తున్నది. ప్రత్యేకించి కాలుష్యం వెహికల్స్ విడుదల చేసే కర్బన ఉద్గారాల వల్ల కూడా వస్తున్నది. ఈ నేపథ్యంలో వెహికల్స్ విడుదల చేసే కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్6 ప్రమాణాలు అమలు చేసిన కేంద్రం.. తాజాగా వచ్చే నెల నుంచి మలి దశ బీఎస్-6 ప్రమాణాలను అమలు చేసేందుకు పూనుకున్నది. మలి దశలో వెహికల్స్ తయారీ సంస్థలు తమ కార్లు, బైక్లు, స్కూటర్లు, కమర్షియల్ వెహికల్స తయారీలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అసలు ఆ ఆర్డీఈ.. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అంటే ఏమిటి.. వీటిని కార్లు, బైక్లు, స్కూటర్లు, కమర్షియల్ వాహనాల తయారీ సంస్థలు పాటించాల్సిన అవసరం ఏమిటి? ఆర్డీఈ నిబంధనలు అమలు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు కస్టమర్లపై ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయమై ఓ లుక్కేద్దాం..
వెహికల్స్ నుంచి వచ్చే కర్బన ఉద్గారాలతో వాయు కాలుష్యం పెరగకుండా ఈయూ దేశాలు ‘యూరో ఎమిషన్’ ప్రమాణాలు సిద్ధం చేశాయి. ఈయూ ఆధ్వర్యంలోని యూరో ఎమిషన్ ప్రమాణాల ఆధారంగా 2000లో కేంద్రం.. భారత్ స్టాండర్డ్ -1 (బీఎస్-1) ప్రమాణాలు అమల్లోకి తెచ్చింది. వీటికి రూపుదిద్దిన భారత కాలుష్య నియంత్రణ మండలి అటుపై బీఎస్-2, బీఎస్-3, బీఎస్-4 పేరిట అప్గ్రేడ్ చేసింది. అటుపై 2020లో కేంద్ర ప్రభుత్వం బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి తెచ్చింది. బీఎస్-6 ప్రకారం వెహికల్స్ విడుదల చేసే కార్బన్డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్, నైట్రోజన ఆక్సైడ్ తదితర ఉద్గారాలు పరిధి దాటొద్దు. ఇందుకు అనుగుణంగా కార్లు, బైక్లు, స్కూటర్లు, కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థలు తయారు చేసిన వెహికల్స్ విడుదల చేసే ఉద్గారాలను ల్యాబ్స్లో పరీక్షించి.. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఆ వెహికల్ విక్రయానికి తేవాల్సి ఉంటుంది.
ఇక బీఎస్-6 రెండో దశ ప్రమాణాలు మరింత కఠినతరం చేసింది కేంద్రం. వెహికల్స్ రిలీజ్ చేసే ఉద్గారాలు నిర్దేశిత పరిమితి మించకూడదు. ఇప్పటి దాక ల్యాబ్స్ లో వెహికల్స్ విడుదల చేసే ఉద్గారాలు పరీక్షించిన కంపెనీలు.. ఇక ఆర్డీఈ ప్రమాణాలు కూడా తు.చ. తప్పకుండా పాటించాల్సిందే..
ఇందుకోసం కంపెనీలు తాము తయారు చేసే వెహికల్స్ విక్రయం తర్వాత అవి రిలీజ్ చేసే ఉద్గారాలు మరింత తగ్గించడానికి పోర్టబుల్ ఎమిషన్స్ మెజర్మెంట్ సిస్టమ్ బిగించాలి. డీజిల్ వినియోగ వెహికల్స్లో సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన (ఎస్సీఆర్) అనే పరికరం అదనంగా తప్పనిసరిగా అమర్చాలి. ఇది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ను వినియోగించి నైట్రోజన్ ఆక్సైడ్లోని ఉద్గారాలను నీరుగా మార్చి విడుదల చేస్తుంది.
ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు కార్ల డ్రైవర్కు తెలిపేందుకు ఆన్బోర్డ్ సెల్ఫ్ డయాగ్నస్టిక్ డివైజ్ను కార్ల తయారీ సంస్థలు అన్ని కార్లలో ఇవ్వాలి. ఉద్గారాల విడుదల సమాచారం, కారు డ్రైవింగ్లో మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షిస్తూ కారు డ్రైవర్కు తెలుపుతుంది. ఒకవేళ ఉద్గారాలు నిర్దిష్ట పరిధిని దాటితే వెంటనే సర్వీస్ చేయించాలని సూచన చేస్తుంది. ఇలాంటి సూచనతో పర్యావరణానికి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తున్నది.
ఆర్డీఈ ప్రమాణాలకు అనుగుణంగా కార్ల తయారీ సంస్థ ఆటోమొబైల్ సంస్థలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫలితంగా కార్ల తయారీ కంపెనీల వివిధ రకాల మోడల్ కార్ల ధరలు తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా కార్ల మోడల్స్, వాటిల్లో వాడే ఫీచర్లను బట్టి ఒక్కో కొనుగోలుదారుడు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మెర్సిడెజ్-బెంజ్, హ్యుండాయ్, టాటా మోటార్స్ వంటి సంస్థలు బీఎస్-6 రెండో దశ ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలతో కూడిన వెహికల్స్ను మార్కెట్లోకి రిలీజ్ చేశాయి.
డీజిల్ కార్లలో రెండు లీటర్ల సామర్థ్యం, అంతకన్నా సామర్థ్యం తక్కువ ఇంజిన గల కార్లలో ఎక్కువ ధర గల ఈ పరికరాలు వాడటం ఆటోమొబైల్ సంస్థలకు గిట్టుబాటు కాదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పలు కంపెనీలు రెండు లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ వినియోగ డీజిల్ వేరియంట్ కార్ల తయారీ నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. హోండా, హ్యుండాయ్, రెనాల్ట్, మహీంద్రా, మారుతి సుజుకి తదితర కార్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ పెట్రోల్ వినియోగ కార్ల ఉత్పత్తి కూడా నిలిపేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మోటార్ బైక్లు, స్కూటర్ల తయారీ సంస్థలు కూడా బీఎస్-6 రెండో దశ ప్రమాణాలు పాటించాల్సిందే. ప్రస్తుతం వాడుతున్న కార్బొనేటర్ల స్థానే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ (ఎఫ్ఐఎస్) ఉపయోగించడంతోపాటు ఓబీడీ ఏర్పాటు చేయాలి. కార్బోనేటర్లతో పోలిస్తే ఎఫ్ఐఎస్లు చాలా ఖర్చుతో కూడుకున్న పని. వీటిని బిగించాలంటే కనీసం బైక్లు, స్కూటర్ల ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయని సమాచారం. 2020లో బీఎస్-4 నుంచి బీఎస్-6కు మారేందుకు కంపెనీలకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా బీఎస్-4 మోడల్ బైక్లు, స్కూటర్లు టూ వీలర్ కంపెనీలు తక్కువ ధరకే విక్రయించాల్సి వచ్చింది.