ముంబై, సెప్టెంబర్ 13: నో యువర్ కస్టమర్ (కేవైసీ) పేరుతో జరుగుతున్న మోసాలపై బ్యాంక్ కస్టమర్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం హెచ్చరించింది. ఖాతా వివరాలు లేదా పాస్వర్డ్స్ వంటి కీలక సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలతో పంచుకోవద్దంటూ సూచించింది. కేవైసీ అప్డేషన్ పేరుతో మోసగాళ్ల వలలో చిక్కుకున్న బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలోనే ఆర్బీఐ పైవిధంగా బ్యాంక్ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. తాము బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ, ఏజెన్సీ ప్రతినిధులమంటూ వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్లపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది. తొందరపడి ఎవరికీ ఎలాంటి పిన్, ఓటీపీ, కార్డ్ నెంబర్లు, ఖాతా, వ్యక్తిగత, లాగిన్ వివరాలు ఇవ్వరాదని, చెప్పొద్దంటూ పేర్కొన్నది. చివరకు ఆర్బీఐ పేరుతో ఇలాంటి వివరాలను కోరినా పట్టించుకోవద్దన్నది. మోసగాళ్ల మాయలోపడితే ఖాతాలోని సొమ్మును దొంగిలిస్తారని తెలిపింది. ఒకవేళ ఎవరైనా మోసపోయామని గుర్తిస్తే వెంటనే ఖాతా ఉన్న బ్యాంక్ కు సమాచారం ఇవ్వాలని, దీనివల్ల మరిన్ని మోసాలకు గురికాకుండా తప్పించుకోవచ్చని సూచించింది. ఇదిలావుంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు.. ఆధార్ ఈ-కేవైసీ లైసెన్స్ కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలియజేసింది.