ముంబై, జూన్ 30 : రూపాయికి మరిన్ని కష్టాలేనంటున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే దేశీయ కరెన్సీ విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ముడి చమురు సరఫరాలో నెలకొన్న అవాంతరాలు తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనడం ఆలస్యమైనా, ఆయా దేశాలు క్షీణించిన తమ చమురు నిల్వలను తిరిగి నింపే క్రమంలో అదనపు డిమాండ్ ఏర్పడినా.. మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పరుగులు పెట్టడం ఖాయమని సెంట్రల్ బ్యాంక్ మంగళవారం విడుదల చేసిన తమ నివేదికలో అంచనా వేసింది. ఇదే జరిగితే డాలర్లకు డిమాండ్ పెరిగి.. రూపాయి మారకం రేటు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే వీలుందని పేర్కొన్నది. అయినప్పటికీ భారత స్థూల ఆర్థిక మూలాలు.. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో వచ్చే ఎదురుదెబ్బలను తట్టుకోగలవన్న విశ్వాసాన్ని ఆర్బీఐ ఆర్థిక సుస్థిరత నివేదిక వ్యక్తం చేసింది. అయితే దేశ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో చమురు సరఫరాలో అడ్డంకులు, పెరిగే ధరలు.. భారత ఆర్థిక వ్యవస్థను ఇంకా ప్రభావితం చేస్తూనే ఉన్నాయని ఈ అర్ధ వార్షిక నివేదికలో ఆర్బీఐ చెప్పుకొచ్చింది.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారత్ సహా యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పరుగులు పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరే శాంతి ఒప్పందంపైనే ఆర్థిక పరిస్థితులు ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ వెలిబుచ్చడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇరు దేశాల నడుమ మధ్యంతర శాంతి ఒప్పందం.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వగలదన్నది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. బలమైన వృద్ధి అవకాశాలు ఇందుకు దోహదపడ్డాయన్నది. అయితే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మందగించాయని, దీనికి కారణం భారతీయ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగిపోవడమేనన్నది. అలాగే ఈ ఏడాది మే నెలలో బంగారం దిగుమతులు గణనీయంగా పడిపోయాయని తెలియజేసింది. అయినప్పటికీ చమురు, ఇతరత్రా ఉత్పత్తుల ధరలతో దేశ ద్రవ్యలోటు ఒత్తిడికి గురికావచ్చన్న ఆందోళనను వెలిబుచ్చింది. ఎక్సైజ్ సుంకాల తగ్గింపు, రాయితీల భారం వంటివి లోటును పెంచుతున్నాయన్నది.
బ్యాంకులను నిధుల కొరత వేధిస్తున్నదని, ఇప్పుడు ఫండింగ్ దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఓ ప్రధాన సవాల్గా మారిందని ఆర్బీఐ తెలియజేసింది. అధిక రాబడులను ఆశిస్తూ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో ప్రజలు తమ సొమ్మును పెట్టుబడులుగా పెడుతున్నారని వివరించింది. దీంతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవారి సంఖ్య తగ్గిపోయిందన్నది. అలాగే ఏఐ ఆధారిత సైబర్ దాడులను సమీప భవిష్యత్తులో బ్యాంకులకున్న పెను ముప్పుగా సెంట్రల్ బ్యాంక్ అభివర్ణించింది. ఇక దేశీయ బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయాయని ఆర్బీఐ ఈ నివేదికలో తెలియజేసింది. ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి 1.8 శాతంగానే ఉన్నట్టు చెప్పింది. అయితే 2028 మార్చికల్లా 1.9 శాతానికి పెరుగవచ్చని, పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితులు కారణమన్నది. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో స్థితిస్థాపకత ఏమాత్రం చెక్కుచెదరలేదని వివరించింది.