న్యూఢిల్లీ, మార్చి 27: దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగడంతో పాటు అమెరికా ఫెడ్తో సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంక్లు కఠిన ద్రవ్య విధానాన్నే అవలంబించడంతో రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 6 వరకూ మూడురోజులపాటు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం కానుంది. ఈ సందర్భంగా రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. మూడు ప్రధాన కేంద్ర బ్యాంక్లు యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయాలను, రిటైల్ ద్రవ్యోల్బణం తీరును ఆర్బీఐ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే క్రమంలో 2022 మే నెల నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్న ఆర్బీఐ పావుశాతం పెంచుతుందని నిపుణులు అంటున్నారు. గత రెండు నెలల్లో ద్రవ్యోల్బణం అధికస్థాయిలో ఉన్నందున, ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లు పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ చెప్పారు. ఇదే అంచనాను ఇండియా రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ డీకే పంత్ వ్యక్తం చేశారు.