Govt Securities – RBI | ఇక నుంచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం మరింత తేలిక కానున్నంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మొబైల్ యాప్ను ఆర్బీఐ త్వరలో అందుబాటులోకి తేనున్నది. 2021 నవంబర్లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్బీఐ.. ‘రిటైల్ డైరెక్ట్’ స్కీమ్ తెచ్చింది. ఆర్బీఐ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ఇన్వెస్టర్లు ప్రైమరీ, సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. వేలంలో ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వ సెక్యూరిటీల క్రయ, విక్రయాలు కూడా చేయొచ్చు.
ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు మరింత సులభతరానికే రిటైల్ డైరెక్ట్ పోర్టల్ అనుబంధ మొబైల్ అప్లికేషన్ తేనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్ల నిధులు సేకరించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోగా, తొలి అర్థభాగంలో రూ.7.5 లక్షల కోట్ల నిధులు సేకరించనున్నది.
ఇదిలా ఉంటే, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వాడకం మరింత పెంచడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ల నుంచి కూడా డిజిటల్ కరెన్సీ వాలెట్ అందుబాటులోకి తేనున్నది. ప్రస్తుతం రిటైల్, హోల్ సేల్ క్యాటగిరీల్లో మాత్రమే ‘సీబీడీసీ’ వాలెట్ సేవలను బ్యాంకులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. రిటైల్ అవసరాలకు సీబీడీసీ వినియోగాన్ని మరింత పెంచేందుకు నాన్ బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు కూడీ సీబీడీసీ వాలెట్లు అందిస్తారని, అందుకవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.