RBI Key interest Rates | ఆర్థిక కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. వరుసగా 11 సార్లు ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడం వల్ల ఇండ్ల కొనుగోలుదారులకు చౌక వడ్డీరేట్లకే హోంలోన్లు లభించనున్నాయి. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ముగిసిన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని తీర్మానించింది. రెపో, రివర్స్రెపో రేట్లతోపాటు అన్ని రకాల వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయి.
ఇంతకుముందు 2020 మే 22న చివరిసారిగా రెపోరేటు నాలుగు శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అప్పుడే రివర్స్ రెపోరేట్ కూడా 40 బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో వడ్డీరేట్లు పెంచకుండా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించడం గమనార్హం.
రెపోరేట్ (షార్ట్ టర్మ్ రుణ పరపతి వడ్డీరేటు) 4 శాతంగానూ, రివర్స్ రెపోరేట్ 3.35 శాతంగానూ ఉంటుంది. అంటే వివిధ బ్యాంకుల్లో ఖాతాదారులు జమచేసే డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేటే రివర్స్ రెపోరేటు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమావేశం కావడం ఇదే తొలిసారి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రుణాల ద్వారా 60 శాతం నిధులు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అంటే రూ.8.45 లక్షల కోట్ల మేరకు రుణాల రూపంలో సేకరించాలని కేంద్రం ప్రణాళిక. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.24 లక్షల కోట్ల రుణాలను సేకరించింది. ఈ నిధుల సేకరణకు ఆర్బీఐ బాండ్ల విక్రయాలు చేపట్టనున్నది.