పడిపోతున్న రూపాయి విలువ.. సామాన్యుల ఆశల్ని ఆవిరి చేస్తున్నది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కనీస కోరికల్ని ఖరీదెక్కిస్తున్నది.డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనం కావడంతో దేశంలోకి జరిగే దిగుమతులు భారంగా మారుతున్నాయి.ఫలితంగా మొబైల్స్, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వాటి ధరలు అమాంతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రూపాయి క్షీణత ఆయా రంగాలనూ కుంగదీస్తున్నది.
న్యూఢిల్లీ, మార్చి 8: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా దిగజారిపోతున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ మంగళవారం రికార్డు కనిష్ఠస్థాయి 77.05 వద్దకు పడిపోయింది. చివరకు స్వల్పంగా కోలుకున్నప్పటికీ 76.90 కనిష్ఠస్థాయి వద్దే ముగిసింది. యుద్ధ సంక్షోభం కొనసాగనున్నందున, రూపాయి త్వరితంగా రికవరీ అయ్యే అవకాశాలు తక్కువని ఫారెక్స్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. రూపాయి ఇదేరీతిలో ఉంటే వచ్చే కొద్ది రోజుల్లో పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని పరిశ్రమ ప్రతినిధులు చెప్తున్నారు. మరోవైపు ఎగుమతి ఆధారిత రంగాలు రూపాయి క్షీణతతో లాభపడతాయని వారంటున్నారు. ఆయా అంచనాల ప్రకారం రూపాయి ప్రభావం ప్రసరించే రంగాలివి…
ధరలు పైపైకి..
రూపాయి భారీగా క్షీణించిన ప్రభావంతో దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్లు తదితరాల ధరలు పెరుగుతాయని హైదరాబాద్లో అసెంబ్లింగ్ యూనిట్ కలిగిన రిసొల్యూట్ ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామిందర్సింగ్ సోయిన్ తెలిపారు. దిగుమతుల కోసం అధికస్థాయిలో రూపాయిల్ని మార్చి, డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ కరెన్సీ చెల్లిస్తున్నందున, ఇక్కడి ధరల్ని కూడా దిగుమతిదారులు పెంచుతారు. అలాగే ముడి వ్యయాలు పెరగనున్నందున వచ్చే త్రైమాసికం నుంచి దేశంలో ఉత్పత్తి మందగిస్తుందని, దీంతో ఈ రంగం వృద్ధి కుంటుపడుతుందని ఆయన హెచ్చరించారు. దిగుమతైన కిట్స్ను ఇక్కడ అసెంబుల్ చేసే కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఐటీ ఎగుమతులకు జోష్
రూపాయి బలహీనత డాలర్లలో ఆదాయం ఆర్జించే ఐటీ రంగానికి లాభించనున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరుగుతుండగా, రూపాయి ఎంత శాతం పతనమైతే, అంతశాతం ఈ ఎగుమతుల విలువ పెరిగే అవకాశం ఉంది. ఆయా కంపెనీలకు డాలర్ల రూపంలో వచ్చే ఆదాయానికి ఇక్కడ మార్పిడిలో ఎక్కువ రూపాయిలు రానున్నందున ఆదాయాలు పెరుగుతాయి. ఫారెక్స్ మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే పలు ఐటీ కంపెనీలు మెరుగైన త్రైమాసిక ఆదాయాల్ని ప్రదర్శిస్తాయని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరణి అరోల్ చెప్పారు. మరోవైపు దేశం నుంచి జరిగే ఫార్మా ఎగుమతుల్లో మూడోవంతు తెలంగాణ రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి. రూపాయి పతనంతో ఈ పరిశ్రమకు మరింత ఆదాయం తెచ్చే అవకాశం ఉంది. అయితే కీలకమైన ముడి పదార్థాలు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)ను దిగుమతి చేసుకుంటున్నందున, ఫార్మా పరిశ్రమ వ్యయాలు పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ఈ రంగం ఎగుమతుల్లో వృద్ధి కనపరుస్తుందన్న అంచనాలున్నాయి.
విదేశీ విద్య భారం
దేశీ కరెన్సీ తగ్గడంతో విదేశాల్లో విద్యనార్జించడం భారంగా పరిణమించనుంది. డాలరు ఖరీదైనందున విదేశీ విద్యకు అవసరమైన ఫీజులు, అక్కడి జీవన వ్యయానికి అధికంగా రూపాయిలు చెల్లించి డాలర్లను కొనాల్సి ఉంటుంది. ఇప్పటికే విదేశీ విద్యకు రుణాలు తీసుకున్నవారు సైతం చెల్లింపులు పెంచాల్సి ఉంటుంది. 10 శాతం మేర రూపాయి తగ్గుదలతో రూ.40 లక్షల రుణం తీసుకున్న విద్యార్థి రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఒక బ్యాంక్ అధికారి వివరించారు. ఈ మేరకు వారి ఈఎంఐ పెరుగుతుంది.