RBI Digital Currency | ఇప్పటికే డిజిటల్ కరెన్సీని చలామణిలోకి తేనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆ దిశగా ఆర్బీఐ మరో ముందడుగు వేయబోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాజెక్ట్గా చలామణిలోకి తేనున్నదని ఆర్బీఐ డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ వాసుదేవన్ ఈ సంగతి చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ కాంక్లేవ్లో ఆయన ఈ విషయం వెల్లడించారు. వచ్చే ఏడాది పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు. అలాగని వేగిరపాటుగా ఆవిష్కరించలేమని కూడా అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆవిష్కరణలో పలు సమస్యలు, సవాళ్లు ఉన్నాయని వాసుదేవన్ అన్నారు. చెప్పగానే అందుబాటులోకి సీబీడీసీని తీసుకురాలేమన్నారు.
సీబీడీసీ ఆవిష్కరణ ఎలా ఉంటుంది? దాని వినియోగం ఎలా ఉంటుందన్న దానిపైనే ఆర్బీఐ కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. సీబీడీసీ డిస్ట్రిబ్యూషన్ చానెల్స్తోపాటు దాని నిర్వహణ వ్యవస్థ, హోల్సేల్, రిటైల్ కస్టమర్లు లక్ష్యంగా దాని పంపిణీకి చర్యలు తీసుకునే విషయమై కసరత్తు చేస్తున్నది.
డిజిటల్ కరెన్సీని ఆవిష్కరించిన తర్వాత దాని రూపకల్పనలో కీలకమైన టెక్నాలజీ.. సదరు డిజిటల్ కరెన్సీని వికేంద్రీకరిస్తుందా? పాక్షిక కేంద్రీకరణకు దారి తీస్తుందా? అన్న అంశాలను పరిశీలిస్తున్నది. తొలి నుంచి క్రిప్టో కరెన్సీలతో దేశీయ ఆర్థిక సూక్ష్మ, ద్రవ్య సుస్థిరతకు ముప్పు వాటిల్లుతుందని ఆర్బీఐ వాదిస్తున్న సంగతి తెలిసిందే.