RBI | న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) పెంచవచ్చన్న అంచనాల నడుమ సోమవారం రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభమయ్యింది. గృహ, ఆటో రుణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే రెపో రేటును 2022 మే నుంచి మొదలుపెట్టి, ఇప్పటివరకూ 2.50 శాతం పెంచారు. ఈ పెంపు ప్రక్రియలో ఏప్రిల్ 6న పెరగబోయేదే చివరిది కావచ్చన్న ఆశాభావం పరిశ్రమ, మార్కెట్ వర్గాల్లో ఉంది. రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజులపాటు సమావేశమై (ఏప్రిల్ 3,5,6) వివిధ దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాల్ని, ధరల తీరును చర్చిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తొలి ద్వైమాసిక పాలసీపై ఆరుగురు సభ్యులు కలిగిన కమిటీ తీసుకున్న నిర్ణయాలను గురువారం గవర్నర్ వెల్లడిస్తారు.
ఆర్బీఐ నిర్దేశిత గరిష్ఠస్థాయి 6 శాతం ఎగువనే కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, ధనిక దేశాల కేంద్ర బ్యాంక్లు యూఎస్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లు ఇటీవల తీసుకున్న చర్యలు-ఈ రెండు అంశాల్ని ఆర్బీఐ కమిటీ లోతుగా చర్చిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 6.52 శాతం, ఫిబ్రవరిలో 6.44 శాతం చొప్పున నమోదయ్యింది. వివిధ కేంద్ర బ్యాంక్లు ఇటీవలి సమీక్షల్లో మరోసారి వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సైతం రెపో రేటును మరో పావుశాతం పెంచుతుందని అంచనా వేస్తున్నారు.