న్యూఢిల్లీ, జూన్ 7: రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను బుధవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రకటించనున్న రెండో సమీక్ష ఇది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఈ సమీక్షలో కూడా సెంట్రల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీరేట్లను పెంచవచ్చునని అంచనాలు నెలకొన్నాయి. రిటైల్, టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో గత నెలలో అనూహ్యంగా ఆర్బీఐ వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.
బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 9.27 శాతం
మే 20తో ముగిసిన పక్షం రోజుల్లో దేశీ బ్యాంక్ల్లో డిపాజిట్లు 9.27 శాతం వృద్ధిచెంది రూ.165.74 లక్షల కోట్లకు చేరగా, రుణాలు 11.04 శాతం వృద్ధితో రూ.120.27 లక్షల కోట్లకు పెరిగినట్టు ఆర్బీఐ తెలిపింది. అంతక్రితం మే 6తో ముగిసిన పక్షంలో బ్యాంక్ రుణాలు 10.82 శాతం వృద్ధిచెందగా, డిపాజిట్లు 9.71 శాతం పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రుణాలు 8.59 శాతం పెరగ్గా, డిపాజిట్లు 8.94 శాతం వృద్ధిచెందాయి. కాగా 2021 మే 21న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ల రుణాలు రూ.108.31 లక్షల కోట్లు, డిపాజిట్లు రూ.151.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.