Nirmala on Interest Rates | ఇటీవల వడ్డీరేట్లు పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కానీ సరైన సమయంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికపై పెరుగుతున్న నిధుల వ్యయం ప్రభావం ఉండబోదని తెలిపారు.
2018 ఆగస్టు తర్వాత ఈ నెల నాలుగో తేదీన తొలిసారి కీలక రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు , క్యాష్ రిజర్వు రేషియో 50 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీంతో రెపోరేట్ 4.40 శాతానికి, క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్) 4.5 శాతానికి పెరిగింది. మామూలుగానైతే ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ సమావేశంలో ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచుతుంది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీన అత్యవసరంగా సమావేశమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ రెపోరేట్, సీఆర్ఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 6.9 శాతంగా నమోదు కాగా, ఏప్రిల్లో 7.7 శాతానికి దూసుకెళుతుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.