సమాచారం లేదు.. సంకేతాలు లేవు.. నిర్ణయాలు మాత్రమే.గుట్టు చప్పుడు కాకుండా రిజర్వ్ బ్యాంక్ అత్యవసర ద్రవ్యసమీక్ష నిర్వహించింది.ద్రవ్యోల్బణం అదుపు పేరుతో సాగిన ఈ సమావేశంలో కీలక వడ్డీరేటును 0.4 శాతం పెంచారు. దీంతో ఇప్పుడు అన్నిరకాల రుణాలు భారం కానున్నాయి.
‘ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా పెరుగుతున్నది. ధరలు ఇలాగే పెరిగితే ప్రమాదం. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే దేశ ఆర్థిక ప్రగతిపైనా దృష్టి పెట్టగలం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇంధన, ఆహారోత్పత్తుల ధరలకు ఆజ్యం పోస్తున్నది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంట దిగుబడులు పెరిగి ద్రవ్యోల్బణం త్వరగా అదుపులోకి రావచ్చు’
– శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
ముంబై, మే 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకిచ్చింది. ఎవరూ ఊహించనివిధంగా అత్యవసర ద్రవ్యసమీక్షను నిర్వహించింది. ఇందులో కీలక వడ్డీరేటైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (0.4 శాతం) పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఆటో, గృహ, ఇతర రుణాలపై వడ్డీ భారం పెరగనున్నది. సోమ, బుధవారాల్లో రెండు రోజులపాటు ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటును 4.4 శాతానికి తీసుకెళ్లింది. అంతకుముందు ఇది రికార్డు కనిష్ఠ స్థాయిలో 4 శాతంగా ఉన్నది. నిజానికి ఆగస్టు 2018 నుంచి రెపో రేటును పెంచిన దాఖలాలే లేవు. ఇక తాజా ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా అంగీకరించింది.
అనూహ్యరీతిలో..
అటు రిటైల్, ఇటు హోల్సేల్ ద్రవ్యోల్బణాలు పెరుగుతూపోతున్న నేపథ్యంలో రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్ల పెంపు ఉంటుందని గత ద్రవ్యసమీక్షలోనే ఆర్బీఐ సంకేతాలిచ్చింది. అయితే అనూహ్యరీతిలో మధ్యంతర ద్రవ్యసమీక్షకు దిగి ఆర్బీఐ రుణదాతలను, రుణగ్రహీతలనూ ఆశ్చర్యపరిచింది. నిజానికి కరోనా పరిస్థితుల నేపథ్యంలో మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్సాహపరిచేందుకు సరిగ్గా రెండేండ్ల క్రితం (మే, 2020) ఇలాగే అనూహ్యరీతిలో ద్రవ్యసమీక్షను చేపట్టి రెపో రేటును ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంతకుముందు అదే ఏడాది మార్చిలో ఏకంగా 75 బేసిస్ పాయింట్లు తగ్గడం విశేషం.
ఫలితంగా గడిచిన ఈ రెండేండ్లూ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయి 4 శాతంగానే రెపో రేటు ఉన్నది. అయితే వడ్డీరేట్లను తగ్గించడానికే గతంలో ఇలాంటి ఆకస్మిక ద్రవ్యసమీక్షల్ని జరిపిన ఆర్బీఐ.. ఇప్పుడు మొదటిసారిగా పెంచడానికి సమావేశం కావడం గమనార్హం. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగిన క్రమంలో ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చే ఈ ఆకస్మిక పెంపునకు దిగినట్టు ఆర్బీఐ చెప్తుండటం దీనికి అద్దం పడుతున్నది. జూన్లో రెపో రేటు మరో 25 బేసిస్ పాయింట్లు పెరగవచ్చన్న అంచనాలు ఇప్పటికే ఉన్న విషయం తెలిసిందే.
ఆర్బీఐకి రూ.87,000 కోట్లు
దేశీయ ద్రవ్యవ్యవస్థలో మితిమీరిన నగదు ఉందన్న నిర్ణయానికి వచ్చిన ఆర్బీఐ.. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 50 బేసిస్ పాయింట్లు (0.5 శాతం) పెంచి 4.5 శాతానికి చేర్చింది. ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఆర్బీఐకి రూ.87,000 కోట్లు రానున్నాయని సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. అయితే రెపో, సీఆర్ఆర్లను పెంచినప్పటికీ రివర్స్ రెపో రేటు జోలికి మాత్రం ఆర్బీఐ వెళ్లలేదు. ఇక స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 4.15 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 4.65 శాతంగా ఉన్నాయి. మొత్తానికి రెండేండ్లుగా దేశ జీడీపీ ప్రగతే ధ్యేయంగా సాగిన ఆర్బీఐ ద్రవ్యసమీక్ష.. ఇక ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా సాగనున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వృద్ధిరేటుపై..
దేశ జీడీపీపై ఆర్బీఐ ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పరిస్థితులు వృద్ధిరేటు పరుగులకు బ్రేకులు వేస్తున్నాయని అభిప్రాయపడింది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారత్సహా అన్ని దేశాల జీడీపీని దెబ్బతీస్తున్నదని వ్యాఖ్యానించింది. ఆయా ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని చెప్పింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) జీడీపీ 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
ద్రవ్యోల్బణంపై..
అంతర్జాతీయ స్థాయిలో ఆహార ధరలు మునుపెన్నడూ లేనివిధంగా పెరుగుతూపోతున్నాయని, ఇది భారత్పైనా చాలా ప్రభావం చూపిస్తున్నదని దాస్ అన్నారు. మరికొన్నాళ్లూ ఇది కొనసాగవచ్చని చెప్పారు. దీంతో ద్రవ్యోల్బణం ఇప్పట్లో అదుపులోకి రాకపోవచ్చన్న సంకేతాల్ని పరోక్షంగా ఇస్తున్నైట్టెంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. ఇదిలావుంటే భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత్కు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలను అందిస్తున్నదని కూడా ఆర్బీఐ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
రుణాలపై వడ్డీ భారం
ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్నిరకాల రుణాలు ప్రియం కానున్నాయి. ముఖ్యంగా ఆటో, గృహ తదితర రుణాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనున్నది. ఇప్పటికే ఆయా బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ఫెడ్ రేటు అరశాతం పెంపు
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) పెంచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:30కి ఈ నిర్ణయం వెలువడింది. 2000 సంవత్సరం తర్వాత ఫెడ్ రేట్లు ఒక్కసారిగా అరశాతం పెరగడం ఇదే ప్రథమం.
ఒక శాతం పెరుగుతాయి
‘ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెపో రేటు 100 బేసిస్ పాయింట్లు (1%) పెరగవచ్చు. దీనివల్ల ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు ప్రియమవుతాయి. అలాగే రెపో రేటు అనుసంధానంగా ఉన్న రుణాలపైనా వడ్డీరేట్లు పెరుగుతాయి.
– ఉదయ్ కొటక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవో
రెపో రేటు అంటే?
వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. ఇదిప్పుడు 4.4 శాతం.
రివర్స్ రెపో రేటు?
ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే స్వల్పకాలిక నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు. ప్రస్తుతం ఇది 3.35 శాతంగా ఉన్నది.
నగదు నిల్వల నిష్పత్తి?
రిజర్వ్ బ్యాంక్ వద్ద బ్యాంకులు ఉంచాల్సిన నగదు నిల్వలు. దీన్నిప్పుడు 4.5 శాతానికి పెంచారు. దీంతో బ్యాంకుల వద్ద నగదు నిల్వలు తగ్గిపోనున్నాయి. ఫలితంగా రుణాల పంపిణీ కూడా తగ్గుతుంది.