Paytm-RBI | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై తీసుకున్న చర్యలతో 80 నుంచి 85శాతం వరకు పేటీఎం వ్యాలెట్ కస్టమర్లు ఎలాంటి అసౌకర్యముండదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు. మిగతా వినియోగదారులు తమ యాప్ను ఇతర బ్యాంకులకు లింక్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై జనవరిలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అన్ని క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్లను నిలిపివేయాలంటూ ఈ నెల 15 వరకు గడువు ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో లింక్ అయిన వాలెట్ను ఇతర బ్యాంకులతో లింక్ చేయడానికి గడువు ఈ నెల 15 వరకు గడువు నిర్ణయించినట్లుగా పేర్కొన్న ఆయన.. మరింత పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గడువు సరిపోతుందని.. మరింత పొడిగించాల్సిన అవసరం లేదన్నారు.
పేటీఎం వ్యాలెట్లలో 80-85 శాతం ఇతర బ్యాంకులతో అనుసంధానమై ఉన్నాయని.. మిగిలిన 15 శాతం తమ వ్యాలెట్స్ను ఇతర బ్యాంకులకు లింక్ చేయాలని సూచించినట్లు తెలిపారు. నియంత్రిత సంస్థపై ఆర్బీఐ చర్యలు తీసుకుందని.. ఫిన్టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా ఇందులో ఏమీ లేదన్నారు. ఆర్బీఐ ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్స్కు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఫిన్టెక్కు ఆర్బీఐ పూర్తి మద్దతు ఇస్తుందని.. అది అలాగే కొనసాగుతుందని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫెరారీని ఉదహరించారు. ఎవరైనా ఫెరారీని సొంతం చేసుకొని నడపొచ్చు. అయితే ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు.
పేటీఎం చెల్లింపు యాప్ లైసెన్స్పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందని అడిగిన ప్రశ్నకు.. ఆయన స్పందిస్తూ అంతర్గత విచారణను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. తమ చర్యలు పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు వ్యతిరేకంగా ఉన్నందున.. పేటీఎం చెల్లింపు యాప్ను కొనసాగించాలని ఎన్సీపీఐ భావిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిపారు. యాప్ ఎన్సీపీఐ వద్ద ఉందని.. అదే త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇదిలా ఉండగా.. పేటీఎం ప్రమోటర్ విజయ్ శేఖర్ వర్మ గత నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బ్యాంక్ డైరెక్టర్ల బోర్డును తిరిగి ఏర్పాటు చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, ఇద్దరు రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులు బ్యాంక్ బోర్డులో చేరారు.