Affordable Home Loans | సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఆర్బీఐ శుభవార్తనందించింది. తక్కువ వడ్డీకి హోంలోన్లు లభించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మూడు రోజులుగా జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో ఎంపీసీ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం తెలిపింది. కొత్తగా ఇంటి రుణాలను ఆర్బీఐ లోన్ టూ వాల్యూ (ఎల్టీవీ)కు అనుసంధానించనున్నది. ఈ విధానం వచ్చే ఏడాది మార్చి నెలాఖరు (2023 మార్చి 31) వరకు అమలులో ఉంటుంది. అంటే కొత్త ఇండ్ల రుణాలను రుణ విలువతో మాత్రమే అనుసంధానిస్తారు.
2020 మే నుంచి 2022 మార్చి నెలాఖరు వరకు ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ఇదే ఎల్టీవీ నిష్పత్తి ప్రాతిపదికన తక్కువ వడ్డీరేటుకే 2023 మార్చి 31 వరకు బ్యాంకులు ఇండ్ల రుణాలు ఇవ్వనున్నాయి. తదనుగుణంగా రిస్క్ వెయిట్లను హేతుబద్ధీకరిస్తామని ఆర్బీఐ తెలిపింది. ఇంతకుముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 అక్టోబర్లో రిస్క్ వెయిట్స్ను హేతుబద్ధీకరించింది. ఇంతకుముందు రుణ పరిమాణం, ఎల్టీవీ ఆధారంగా రిస్క్వెయిట్లు ఖరారు చేసేవి బ్యాంకులు. రుణంతోపాటు ఆస్తి విలువను బట్టి ఎల్టీవీ నిర్ధారిస్తారు.
ఆర్థిక రంగ పునరుద్ధరణలో రియాల్టీ రంగం ప్రాముఖ్యతను గుర్తించింది ఆర్బీఐ. రియాల్టీ రంగంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేసింది. సొంతిండ్లకు గల ప్రాముఖ్యత, వివిధ రంగాలపై దాని ప్రభావాన్ని గుర్తిస్తూ.. ఎల్టీవీ నిష్పత్తి గైడ్లైన్స్ వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. దీనివల్ల సొంతింటిని కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ గైడ్లైన్స్ ప్రకారం తక్కువ వడ్డీపై అధిక రుణ పరపతి లభిస్తుంది.
పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు రుణాలపై రిస్క్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముందే చెప్పినట్లు హోంలోన్లపై రిస్క్ ప్రభావం తక్కువ. లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) పైనే ఇంటి కొనుగోలుదారులకు ఇచ్చే ఇంటి రుణాల పరిమితి ఆధారపడి ఉంటుంది. ఆస్తి విలువను బట్టి బ్యాంకులు/ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయిస్తాయి. ఇదే లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) అంటారు.
కరోనా ప్రారంభంలో అంటే 2020లో హౌసింగ్ రంగం సేల్స్ 50 శాతం పడిపోయాయి. గతేడాది ఇండ్ల విక్రయాలు శరవేగంగా పుంజుకున్నాయి. చారిత్రక స్థాయిలో తక్కువ వడ్డీరేట్లు ఉండటం కూడా ఇండ్ల కొనుగోళ్లు పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు 6.5 శాతం వడ్డీరేట్లపై ఇండ్ల రుణాలిస్తున్నాయి.