న్యూఢిల్లీ, మార్చి 31: డీటీహెచ్, ఓటీటీ లాంటి రీచార్జ్లు, వినిమయ (యుటిలిటీ) బిల్లులు సహా వివిధ రకాల సేవలకు సంబంధించిన ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపుల విషయంలో వినియోగదారులకు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పెద్ద ఉపశమనాన్ని కల్పించింది. రూ.5 వేల కంటే ఎక్కువ విలువైన ఆటో డెబిట్ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణను తప్పనిసరి చేయాలన్న కొత్త మార్గదర్శకాల అమలును ఆరు నెలలు (ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 తర్వాత అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) లేకుండా కార్డులు, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), ప్రీపెయిడ్ పేమెంట్ పద్ధతులను ఉపయోగించి జరిపే ఆటో డెబిట్ చెల్లింపులను నిలిపివేయాలని ఆర్బీఐ గతేడాది డిసెంబర్ 4న బ్యాంకులను, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లను ఆదేశించింది. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా మార్చడంతోపాటు మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు ఈ మార్గదర్శకాలను ప్రవేశపెడుతున్నట్లు అప్పట్లోనే ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ వీటిని అమలు చేసేందుకు కొన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇప్పటికీ సన్నద్ధం కాలేదు