RBI-Loan Waiver | రుణ మాఫీ ఆఫర్ల పేరిట వార్తా పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయంటూ కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం ఆర్బీఐ ద్రుష్టికి వచ్చింది. దీంతో అటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
‘రుణ మాఫీ ఆఫర్లంటూ కొన్ని సంస్థలు వార్తాపత్రికల్లో, సోషల్ మీడియా వేదికలపై విస్త్రుతంగా ప్రచారం చేస్తూ.. సర్వీస్ లేదా చట్టపరమైన ఫీజు పేరిట నగదు వసూలు చేసిన రుణ మాఫీ ధ్రువ పత్రాలు జారీ చేస్తున్నాయి. ఇలా ధ్రువ పత్రాలు జారీ చేసేందుకు సదరు సంస్థలకు అనుమతి లేదు’ అని ఆర్బీఐ తెలిపింది.
‘ప్రజలు తీసుకున్న రుణాలు సదరు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లించనవసరం లేదని వినియోగదారులకు చెబుతున్నాయి. ఇటువంటి ప్రచారం వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థల స్థిరత్వం, డిపాజిటర్ల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. అసత్య ప్రచారం చేస్తున్న సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కనుక ఇటువంటి ప్రకటనలను నమ్మకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని ఓ ప్రకటనలో ప్రజలకు ఆర్బీఐ సూచించింది.