RBI | బ్యాంకులు, ఆన్లైన్ పేమెంట్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటున్నది. నిబంధనల ఉల్లంఘనపై కొరఢా ఝుళిపిస్తున్నది. అదే సమయంలో లావాదేవీలు జరుపకుండా ఆంక్షలు విధిస్తున్నది. రూల్స్ పాటించిన బ్యాంకులకు జరిమానాలు విధిస్తున్నది. ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మార్చి ఒకటి నుంచి డిపాజిట్ల సేకరణ, టాపప్ సర్వీసెస్ తదితర సేవలను నిలిపివేయాలని ఆదేశింది. తాజాగా ప్రముఖ చెల్లింపు గేట్ సంస్థలైన వీసా, మాస్టర్కార్డ్లకు రిజర్వ్ షాక్ ఇచ్చింది.
కమర్షియల్ కార్డులను ఉపయోగించి విక్రేతలకు చెల్లింపులు చేయకుండా చర్యలు చేపట్టింది. అయితే, ఎందుకు నిషేధం విధించదన్న దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. సమాచారం మేరకు కేవైసీ లేని వ్యాపారులకు ఆయా కార్డుల ద్వారా చెల్లింపులు జరుగుతున్నట్లుగా ఆర్బీఐ గుర్తించింది. అయితే, కేవైసీ చేయకుండా లావాదేవీలు జరుపుతుండడంతో ఆర్బీఐ చర్యలు చేపడుతున్నది. వాస్తవానికి క్రెడ్, పేటీఎం, నోబ్రోకర్ తదితర యాప్లు వినియోగదారులు కార్డుల ద్వారా చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తుంటాయి.
సాధారణ వ్యాపార సంస్థలు నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్, బల్క్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లింపులు జరుపుతుంటాయి. కార్డుల ద్వారా విక్రేతలకు చెల్లింపులు చేసే ప్రక్రియను అభివృద్ధి చేసిన ఫిన్టెక్, కార్డ్ నెట్వర్క్లు తప్ప.. ఈ రంగంలో కార్డు చెల్లింపులు సాధారణంగా ఉపయోగించడానికి అవకాశం ఉండదు. ఈ సందర్భంగా నోటీసు అందుకున్న ఫిన్టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. కమర్షియల్ కార్డుల ద్వారా చెల్లింపులను నిలిపివేయాలని ఆర్బీఐ కోరిందన్నారు.
కార్డ్ నెట్వర్క్లు ఆమోదం లేకుండా పని చేస్తున్నాయని.. ఫిన్టెక్లు, కార్డ్ నెట్వర్క్లు వ్యాపార విక్రేతలకు కార్డ్ చెల్లింపులు చేసే ప్రక్రియను సృష్టించే వరకు కార్డ్ చెల్లింపులు ఉపయోగించబడవని.. కొన్ని కార్డ్ నెట్వర్క్లు ఆర్బీఐ నుంచి చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ కోసం సూత్రప్రాయంగా ఆమోదం పొందని కంపెనీలతో పని చేస్తున్నాయన్నారు. ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో ఇంటి అద్దెలు, ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అనేక ఫిన్టెక్ కంపెనీలు ట్యూషన్ ఫీజులు, అద్దెను చెల్లించేందుకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.