RBI | ముంబై, డిసెంబర్ 11: రుణాలను మాఫీ చేయిస్తామంటూ ప్రింట్, సోషల్ మీడియాల్లో వచ్చే అనధికారిక ప్రకటనలను చూసి మోసపోవద్దని ప్రజలకు సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. ఈ రకమైన తప్పుడు అడ్వైర్టెజ్మెంట్లను నమ్మి, వాటి మాయలో పడి నష్టపోవద్దని ఓ ప్రకటనలో హెచ్చరించింది. అమాయక రుణగ్రహీతలే లక్ష్యంగా కొన్ని సంస్థలు, కొందరు మోసగాళ్లు రుణాలను మాఫీ చేయిస్తామని తప్పుడు ప్రకటనల్నిస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. వార్తా పత్రికలు, సామాజిక వెబ్సైట్లలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగిస్తూ ఎందర్నో మోసం చేస్తున్నారని చెప్పింది.
ఎటువంటి చట్టబద్ధత, గుర్తింపు లేని రుణ మాఫీ సర్టిఫికెట్లను జారీ చేసి, వాటికి సర్వీస్/లీగల్ చార్జీలను సైతం వసూలు చేస్తున్నారని ఆర్బీఐ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో జరిగే ఈ రకమైన తప్పుడు చర్యలతో బ్యాంకులకు చెడ్డపేరు వస్తున్నదని కూడా ఆర్బీఐ ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది. ‘బ్యాంకులుసహా ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై చెల్లించనక్కర్లేదని, వాటిని మాఫీ చేయిస్తామని కొన్ని సంస్థలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. ఈ రకమైన దుష్ప్రచారం ఆయా ఆర్థిక సంస్థల సుస్థిరతనే దెబ్బతీస్తాయి. అంతేగాక డిపాజిటర్ల ప్రయోజనాలనూ నష్టపరుస్తాయి’ అని ఆర్బీఐ వ్యాఖ్యానించింది. అందుకే ఈ ప్రకటనల్ని నమ్మవద్దని, నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని ప్రజలకు సూచించింది.
పన్నేతర ఆదాయాలను పెంచుకోవడానికి ఆస్తుల నగదీకరణపై రాష్ర్టాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర బడ్జెట్లపై వచ్చిన ఆర్బీఐ నివేదిక సూచించింది. రోడ్డు, రవాణా, విద్యుత్తు రంగాలు ఇందుకు అనువైనవిగా అభిప్రాయపడింది.