Ratan Tata | టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను సత్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా ‘మహారాష్ట్ర ఉద్యోగ రత్న అవార్డ్’ ప్రదానం చేయనున్నది. ఈ సంగతి మహారాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సామంత్ ప్రకటించారు. విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు మహారాష్ట్ర ప్రభుత్వం అందజేసే అత్యున్నత రాష్ట్ర పురస్కారం ‘మహారాష్ట్ర ఉద్యోగ రత్న’. ఈ ఏడాది నుంచే ఉద్యోగ రత్న అవార్డు ప్రదానం చేయాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.
సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సామంత్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, మరాఠీ పారిశ్రామికవేత్తలకూ అవార్డులు ప్రదానం చేయాలని కూడా నిర్ణయించారు. వ్యాపారం, పరిశ్రమ, విద్య, రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, బ్యాంకింగ్, ఐటీ, ఫుడ్స్, హెల్త్ కేర్ తదితర రంగాల్లో అసాధారణ సేవలందించిన పారిశ్రామికవేత్తలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నది.
రతన్ టాటా ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా పని చేసింది. ప్రస్తుతం గ్లోబల్ ఐటీ జెయింట్ సంస్థల్లో ఒకటి టీసీఎస్. ఆయన హయాంలోనే న్యూయార్క్ స్టాక్ ఎక్చ్సేంజ్లో టాటా మోటార్స్ లిస్టయింది. 21 ఏండ్ల పాటు టాటా సన్స్ చైర్మన్గా రతన్ టాటా పని చేసినప్పుడు సంస్థ 40 రెట్లకు పైగా ఆదాయం, 50 రెట్లకు పైగా లాభాలు గడించింది. 2000లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు రతన్ టాటా.