Jaguar Land Rover | టాటా మోటార్స్ (Tata Motors) అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (Jaguar Land Rover) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 24 నుంచి భారత్లోనే రేంజ్ రోవర్ (Range Rover), రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) కార్లను తయారు చేయనున్నది. 54 ఏండ్ల చరిత్ర గల బ్రిటన్ కార్ల తయారీ బ్రాండ్ ‘జాగ్వార్ లాండ్ రోవర్ ((Jaguar Land Rover)’ తన కార్లను యునైటెడ్ కింగ్డం (UK) బయట తయారు చేయడం ఇదే తొలిసారి కానున్నది.
ఇప్పటి వరకూ యునైటెడ్ కింగ్డమ్లోని సొలిహల్లో గల జాగ్వార్ లాండ్ రోవర్ ప్లాంట్లో మాత్రమే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లను తయారు చేసి భారత్ సహా 121 దేశాలకు ఎగుమతి చేస్తోంది. భారతీయ కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా, ధరల తగ్గింపుతో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా జాగ్వార్ లాండ్ రోవర్ దేశీయంగా తన కార్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నది. దేశీయంగా కార్ల తయారీ వల్ల ధరలు 18-22 శాతం తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు.
15 ఏండ్ల క్రితం జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థను టేకోవర్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కృషిని సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రశంసించారు. ‘రేంజ్ రోవర్ కార్లు ఇకనుంచి భారత్లోనే తయారు కావడం సూపర్ ఫీలింగ్ కలిగిస్తున్నది. ఇది చాలాచాలా స్పెషల్ మూవ్ మెంట్. నేను గర్వ పడుతున్నా’ అని వ్యాఖ్యానించారు. దేశీయంగా తయారీ అవుతుండటంతో ఈ కార్ల విక్రయాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రేంజ్ రోవర్ కార్లు అమ్మకాలు పెరుగుతాయని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
దేశీయంగా కార్ల తయారీ వల్ల భారత్ కస్టమర్లకు విస్తృత శ్రేణిలో అందుబాటులోకి వస్తాయని జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా ఎండీ రంజన్ అమ్డా వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో దేశీయంగా ప్రీమియం కార్ల కోసం గిరాకీ పెరుగుతున్నదన్నారు. గత ఏడాది కాలంలో జేఎల్ఆర్ కార్ల విక్రయాలు 81 శాతం పెరిగి 4,436 యూనిట్లకు చేరుకున్నాయి.