Rana Talwar – Standard Chartered Bank | గ్లోబల్ బ్యాంక్ ‘స్టాండర్డ్ చార్టర్డ్ ’ చీఫ్గా పని చేసిన తొలి భారతీయుడు రాణా తల్వా్ర్ (76) శనివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య రేణు, కొడుకు రాహుల్ ఉన్నారు. రాణా తల్వార్ భార్య రేణుక డీఎల్ఎఫ్ గ్రూప్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్ తనయ. రాహుల్ కూడా డీఎల్ఎఫ్లో కీలకంగా ఉన్నారు. ఆదివారం రాణా తల్వార్ అంత్యక్రియలు లోధీ శ్మశాన వాటికలో జరుగుతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన రాణా తల్వార్ 1969లో సిటీ బ్యాంకులో తన కెరీర్ ప్రారంభించారు. 1990వ దశకంలో బ్యాంక్ కన్జూమర్ బిజినెస్ పెరుగుదలలో కీలక పాత్ర పోషించారు. దీంతో సిటీ బ్యాంక్ ఆసియా-పసిఫిక్, మిడిల్ ఈస్ట్, యూరప్, నార్త్ అమెరికా రిటైల్ బిజినెస్లకు సారధ్యం వహించారు.
అటుపై 1997లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో చేరారు. కొద్ది నెలల్లోనే బ్యాంకు సీఈఓ స్థాయికి చేరారు. ఆసియా కరెన్సీ సంక్షోభం వచ్చినప్పుడే ఆయన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓగా పలు బ్యాంకుల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. యూబీఎస్ ట్రేడ్ ఫైనాన్స్ బిజినెస్ ఇంటిగ్రేషన్ తోపాటు ఏఎన్జడ్ గ్రిన్లే బ్యాంక్ భారత్, మిడిల్ ఈస్ట్, హాంకాంగ్లో ఛేస్ మాన్హట్టన్ క్రెడిట్ కార్డు బిజినెస్ లను ఆయన సారధ్యంలోనే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ టేకోవర్ చేసింది.
తర్వాత కొంత కాలానికి తన పేరు మీదుగా సాబ్రే క్యాపిటల్ అనే ప్రైవేట్ క్యాపిటల్ ఈక్విటీ ఫండ్ ఏర్పాటు చేశారు. భారత్ లోని ప్రముఖ బ్యాంకు సెంచూరియన్ బ్యాంకులో అత్యధిక వాటాను ఈ సాబ్రే క్యాపిటల్ ఈక్విటీ ఫండ్ టేకోవర్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సెంచూరియన్ బ్యాంకు విలీనంలోనూ కీలకంగా వ్యవహరించారు. 2006లో రియాల్టీ సంస్థ డీఎల్ఎఫ్లో చేరిన రాణా తల్వార్.. కంపెనీ బోర్డు డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన మరణం పట్ల డీఎల్ఎఫ్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తీవ్ర విచారం వ్యక్తం చేసింది.