Ram Mandir-RBI | అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ నెల 22న పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు హాఫ్ డే సెలవు ఇచ్చాయి. ఉత్తర ప్రదేశ్లో మాత్రం ప్రైవేట్ బ్యాంకులు మూసివేస్తారని ఆర్బీఐ తాజాగా ఇచ్చిన అప్ డేట్లో తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకులు మాత్రం రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం తెరిచి ఉంచుతారని పేర్కొంది. ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా మూసి ఉంచుతారని ఆర్బీఐ తన వెబ్ సైట్లో తెలిపింది.
రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ నెల 22 మధ్యాహ్నం 2.30 గంటల వరకూ మూసి ఉంటాయని ఆర్బీఐ తెలిపిందని పీటీఐ ఓ వార్తా సంస్థ ప్రచురించింది.
ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యాలు సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తమ శాఖలు మూసివేస్తామని ధ్రువీకరించాయి. మణిపాల్లో మాత్రం మోయిను ఇరాత్పా సందర్భంగా సోమవారం బ్యాంకులు పని చేయవు. ఇక గత మే నెలలో చలామణి నుంచి తొలగించిన రూ.2000 నోటును ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మంగళవారం నుంచి మార్చుకోవచ్చు.
ఈ నెల 26 నుంచి వరుసగా మూడు రోజులూ బ్యాంకులకు సెలవులు వచ్చాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 (శుక్రవారం) బ్యాంకులు పని చేయవు. 27న నాలుగో శనివారం, 28న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.