Rakesh Jhunjhunwala | రాకేష్ ఝున్ఝున్ వాలా భార్య రేఖా ఝున్ఝున్ వాలా సోమవారం రూ.800 కోట్లు నష్టపోయారు. టాటా సన్స్ అనుబంధ జ్యువెల్లరీ సంస్థ టైటాన్ గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేదు. దీంతో టైటాన్ షేర్లు ఏడు శాతం నష్టపోయాయి.
టాటా సన్స్ అనుబంధ టైటాన్ సంస్థలో రేఖా ఝున్ఝున్వాలాకు 2024 మార్చి 31 నాటికి 5.33 శాతం వాటా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గత శుక్రవారం ముగిసే నాటికి రేఖా ఝున్ ఝున్ వాలా వాటాల విలువ రూ.16,792 కోట్లు అని తెలుస్తున్నది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో టైటాన్ షేర్ సోమవారం రూ.3,352లతో కనిష్ట స్థాయికి పడిపోయి ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.3,281.65 వద్ద ముగిసింది. ఫలితంగా టైటాన్ నికర మార్కెట్ క్యాపిటలైజేసన్ రూ.22 వేల కోట్లకు పైగా నష్టపోయి రూ.2,91,340.35 కోట్లకు పరిమితమైంది. దీంతో టైటాన్లో రేఖా ఝున్ఝున్ వాలా వాటా విలువ సుమారు రూ.15,986 కోట్లకు పడిపోయింది.