ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా, మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా గత కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేశ్ గోపినాథన్ ఇవాళ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా ప్రకటించారు. టీసీఎస్తో తనది 20 ఏళ్ల అనుబంధమని ఈ సందర్భంగా ఉద్యోగులకు మంగళవారం రాసిన వీడ్కోలు లేఖలో రాజేశ్ గోపినాథన్ పేర్కొన్నారు.
టీసీఎస్ సంస్థను ఏకంగా ఆరేళ్లపాటు లీడ్ చేసినందుకు తనకు చాలా గర్వంగా ఉందని గోపినాథన్ చెప్పారు. ఈ ఆరేళ్ల కాలంలో సంస్థలో, మనలో ఎన్నో మార్పులు వచ్చాయని, కంపెనీ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. కాగా, రాజేశ్ గోపినాథన్ స్థానంలో క్రితి క్రితివాసన్ జూన్ 1న టీసీఎస్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాజేశ్ గోపినాథన్.. క్రితివాసన్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.