Rains effect on Coal Supply | పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలుస్తోంది. బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా సాగే ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
ఇప్పటికే దేశమంతా బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తికి ఆటంకాలు కలుగుతున్నాయి. విద్యుత్ సంక్షోభం తలెత్తుందేమోనన్న ఆందోళన మధ్య.. ఉత్పత్తికి అవసరమైన మేరకు బొగ్గు సరఫరాకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. కానీ తాజాగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొన్ని రోజుల పాటు బొగ్గు సరఫరా తగ్గవచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి.
కొన్ని బొగ్గు గనులు మూతపడటంతోపాటు వర్షాల వల్లే సకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా కావడం లేదని కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గగానే ఈ సమస్యను అధిగమించగలమని భరోసా వ్యక్తం చేసింది.
డిమాండ్కు అనుగుణంగా కొత్త గనుల్లో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడంతోపాటు క్యాప్టివ్ మైన్స్ నుంచి బొగ్గు సరఫరాను ప్రారంభించింది. బొగ్గు సరఫరాలో సమస్యలు తలెత్తినా ఆందోళన చెందనవసరం లేదని.. పరిస్థితులు మెరుగవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. రోజూ 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొంది.