న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మల్టీ-స్పెషాల్టీ పిల్లల దవాఖానల గ్రూప్.. రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ.2,000 కోట్లకుపైగా నిధులను సమీకరించాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి ప్రిలిమినరీ పేపర్లను రెయిన్బో దాఖలు చేసింది. ఈ ఐపీవోలో ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ విలువ రూ.280 కోట్ల వరకు ఉన్నట్టు మార్కెట్ వర్గాల అంచనా. ఇక ఆఫర్ సేల్లో వాటాదారులకు సంబంధించిన 2.4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెట్టనున్నారని డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) వివరాల ప్రకారం తెలుస్తున్నది. కాగా, అర్హులైన ఉద్యోగులకు షేర్లను కేటాయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులను గతంలో సంస్థ జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) ముందస్తు విడుదలకు ఉపయోగించాలని భావిస్తున్నారు. అలాగే కొత్త దవాఖానల ఏర్పాటు, వైద్య పరికరాల కొనుగోలు తదితర అవసరాలకూ ఐపీవో నిధులను వినియోగించనున్నారని తెలుస్తున్నది. కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, జేపీ మోర్గాన్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఇష్యూ ప్రధాన మేనేజర్లుగా ఉన్నాయి.
హైదరాబాద్ నుంచే మొదలు..
బ్రిటన్కు చెందిన డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సీడీసీ గ్రూప్.. రెయిన్బోను నిర్వహిస్తున్నది. దేశంలో రెయిన్బో తొలి దవాఖాన హైదరాబాద్లోనే ఏర్పాటైంది. 1999లో 50 పడకల సామర్థ్యంతో పిల్లల దవాఖానను రెయిన్బో ప్రారంభించింది. అప్పట్నుంచి మల్టీ స్పెషాల్టీ పీడియాట్రిక్ సర్వీసులను విస్తరిస్తూ పోతూనే ఉన్నది. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో 14 దవాఖానలు, 3 క్లినిక్లు ఉన్నాయి.
మరికొన్ని ఐపీవోలు
వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్, క్యాపిల్లరీ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థలు కూడా ఐపీవో కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు మేదాంత బ్రాండ్లో దవాఖానలను నడిపిస్తున్న గ్లోబల్ హెల్త్ లిమిటెడ్తోపాటు క్లినికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ వీడా క్లినికల్ రిసెర్చ్ ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.