Railway Rules | భారతీయ రైల్వే ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నది. నిబంధనల్లో పలు మార్పులు చేసింది. జనరల్ రిజర్వేషన్ టికెట్లకు సైతం ఆధార్ అథంటికేషన్ను తప్పనిసరి చేసింది. ఈ నిబంధన అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నది. మారిన నిబంధనల ప్రకారం.. జనరల్ రిజర్వేషన్లు టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఆధార్ నంబర్ను తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే, టికెట్లు ఓపెన్ అయిన 15 నిమిషాల వరకు మాత్రమే ఆధార్ నిబంధన వర్తిస్తుంది. రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంతో పాటు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.
ఈ నిబంధన ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ రెండింటిలోనూ వర్తిస్తుందని రైల్వేశాఖ పేర్కొంది. వాస్తవానికి రైల్వే టికెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఏజెంట్లు, బ్రోకర్లు కొన్ని సాఫ్ట్వేర్ల సహాయంతో ముందస్తుగానే టికెట్లను బుక్ చేస్తున్నట్లుగా రైల్వే గుర్తించింది. దాంతో సాధారణ రైల్వే ప్రయాణికులు టికెట్లు పొందలేకపోతున్నారు. అయితే, రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందుకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేసుకోవాలని రైల్వేబోర్డు అన్ని రైల్వేలు, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీని సర్క్యూలర్ను పంపింది. ప్రస్తుతం జనరల్ రిజర్వేషన్ కోసం బుకింగ్ను ప్రతిరోజూ అర్ధరాత్రి 12.20 గంటలకు మొదలై.. రాత్రి 11.45 గంటల వరకు కొనసాగుతుంది. మిగతా సమయాల్లో మేయింటనెన్స్ పనులు జరుగుతాయి. జనరల్ టికెట్ల అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఏదైనా రైలు ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు మొదలవుతుంది.
అర్ధరాత్రి 12.20 గంటలకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇకపై ఎవరైనా సంబంధిత రైలు టికెట్లు విడుదలయ్యే 15 నిమిషాల ముందు తప్పనిసరిగా ఆధార్ అథంటికేషన్ చేస్తేనే టికెట్లు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే టికెట్లు బుక్ అయ్యే అవకాశం ఉండదు. 15 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. అప్పటి వరకు టికెట్లు ఉంటేనే బుక్ చేసుకునే వీలుంటుంది. రైల్వే నిర్ణయంతో సాధారణ ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనున్నది. పండుగల సమయంలో రైళ్ల టికెట్లకు భారీగా గిరాకీ ఉంటుంది. బుకింగ్ మొదలైన కొద్ది సమయంలోనే కొన్ని రైళ్లలో టికెట్లు నిండిపోతున్నాయి. డిమాండ్ను ఆసరా చేసుకొని ఏజెంట్లు, బ్రోకర్లు మోసపూరిత పద్ధతుల్లో టికెట్లను బ్లాక్ చేస్తున్నట్లుగా రైల్వే గుర్తించింది. ఈ క్రమంలో ఆధార్ అథంటికేషన్తో ప్రయాణికులకు ఊరట లభించనున్నది. ప్రస్తుతం తత్కాల్ టికెట్లకు అమలు చేస్తున్న ఈ విధానం జనరల్ టికెట్లకు అమలు చేస్తున్నది.