రైల్వే క్యాటరింగ్ సంస్థ ఐఆర్సీటీసీ స్క్రిప్ట్ శుక్రవారం భారీ ఒడిదొడుకులకు గురైంది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 25 శాతం నష్టపోయి రూ.650 వద్దకు పడిపోయింది. దీంతో కొన్ని నిమిషాల్లోనే ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14 వేల కోట్లు పడిపోయి.. దాని ఎం-క్యాప్ రూ.58 వేల కోట్లకు చేరుకుంది. గురువారం ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.74 వేల కోట్లు.. ఒక్కరోజులో ఏం జరిగింది.. ఐఆర్సీటీసీ స్క్రిప్ట్ భారీగా పతనం కావడానికి కారణాలేమిటో చూద్దాం.
ఐఆర్సీటీసీకి వచ్చే ఆదాయంలో సగం తమకు సర్వీస్ చార్జీ రూపంలో చెల్లించాలని రైల్వేశాఖ గురువారం ఆదేశించింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. కానీ దీనిపై నెటిజన్లు, మదుపర్ల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తింది.
శుక్రవారం స్క్రిప్ట్ భారీగా పతనం కావడంతో 50 శాతం సర్వీస్ చార్జీ చెల్లించాలన్న నిబంధనను ఉపసంహరిస్తున్నట్లు దీ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అసెట్ అండ్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అటుపై ఐఆర్సీటీసీ స్టాక్ రూ.650 నుంచి రూ.901కి దూసుకెళ్లింది. కేవలం రెండు గంటల్లోనే ఫ్లక్సుయేషన్తో రూ.270 పెరిగింది షేర్.. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ తిరిగి రూ.74 వేల కోట్లకు చేరుకున్నది. అయినా ఐఆర్సీటీసీ షేర్ ఇంకా నష్టంలోనే కొనసాగుతున్నది.
కరోనా లాక్డౌన్ ఉన్నా, రైళ్ల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నా 2020-21లో ఐఆర్సీటీసీ రూ.299 కోట్ల కన్వీయెన్స్ ఫీజు రూపేణా ఆదాయం పొందింది. 2019-20లో ఇది రూ.349 కోట్లు. 2014కు ముందు వరకు ఐఆర్సీటీసీ ఎటువంటి ఫీజును రైల్వేశాఖతో షేర్ చేసుకునేది కాదు.
2014 తర్వాత ఐఆర్సీటీసీ-రైల్వేశాఖ మధ్య 80-20 నిష్పత్తితో, 2015 తర్వాత 50-50 నిష్పత్తితో రెవెన్యూ షేర్ చేసుకున్నాయి. కానీ, 2016 నవంబర్ తర్వాత మూడేండ్ల పాటు ఈ రెవెన్యూ షేర్ విధానాన్ని రద్దు చేసింది.