Qualcomm – Jio | ప్రముఖ చిప్ మేకింగ్ సంస్థ క్వాల్కామ్ (Qualcomm).. రిలయన్స్ జియో (Reliance Jio)తో కలిసి భారత్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ 5జీ- స్మార్ట్ ఫోన్ తయారీపై కసరత్తు చేస్తున్నది. దేశవ్యాప్తంగా శరవేగంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రిలయన్స్ జియో.. ఈ ఏడాది చివరి నాటికి భారత్ మార్కెట్లో 5జీ ఎంట్రీ లెవల్ ఫోన్ ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. దీని ధర సుమారు రూ.8,200 (99 డాలర్లు) ఉంటుందని అంచనా.
చౌక ధరకే స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం క్వాల్ కామ్, రిలయన్స్ జియో ఈ ఫోన్ తీసుకొస్తున్నాయి. జియో ఆఫర్లతోపాటు 5జీకి మద్దతుగా ఈ ఫోన్ నిలుస్తుంది. 4జీ నుంచి 5జీ కి స్మార్ట్ ఫోన్ యూజర్లు మారడంపై ఫోకస్ చేస్తున్నట్లు క్వాల్ కామ్ హ్యాండ్ సెట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – జనరల్ మేనేజర్ చిరిస్ ప్యాట్రిక్ చెప్పారు. తమ నిర్ణయంతో భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మంది ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జియో, క్వాల్ కామ్ చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటే రీతిలో 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ తేవాలని క్వాల్ కామ్, జియో యోచిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.7,000లతో ప్రారంభం అవుతున్నాయి. కానీ అన్నింటిలోనూ 5జీ సేవలు తక్కువ. రూ.8,000 ధర సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ తేవడం దేశీయ మార్కెట్ రూపురేఖలను మార్చేస్తుందని రెండు సంస్థలు భావిస్తున్నాయి. 2జీ ఫీచర్ ఫోన్ల యూజర్లు సైతం 5జీ స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లేందుకు దోహద పడుతుందని భావిస్తున్నారు.