‘మధ్యకాలికంగా అధిక మార్జిన్లు ఆర్జించేందుకు మేము బాట వేసుకుంటున్నాం. మా సిబ్బందిపై పెట్టుబడి చేస్తూనే ఉంటాం. మా క్లయింట్లకు మద్దతుగా నిలుస్తాం. మా సమర్థత, వ్యయ నియంత్రణ పట్ల క్లయింట్లకు ఉన్న ఆసక్తి కారణంగా పెద్ద డీల్స్ సాధించాం’
-సలీల్ పరేఖ్, సీఈవో, ఇన్ఫోసిస్
ముంబై, ఏప్రిల్ 13: దేశంలో ద్వితీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2022-23 నాలుగో త్రైమాసికంలో ఆదాయ, లాభాల వృద్ధిపై విశ్లేషకులు అంచనాలను ఇన్ఫోసిస్ చేరలేకపోయింది. ముగిసిన క్యూ4లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 8 శాతం వృద్ధితో రూ.6,128 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.37,441 కోట్లుగా నమోదయ్యింది. ఆదాయం రూ.38,800 కోట్లు, నికరలాభం రూ. 6,550 కోట్లు ఉండవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇక క్యూ3 (అక్టోబర్-డిసెంబర్)తో పోలిస్తే కంపెనీ నికరలాభం 7 శాతం క్షీణించగా, ఆదాయం 2.3 శాతం తగ్గింది. ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూసే గైడెన్స్లో సైతం ఇన్ఫీ నిరుత్సాహపర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కేవలం 4-7 శాతం మధ్య వృద్ధిచెందవచ్చన్న గైడెన్స్ను వెల్లడించింది. ఐటీ కంపెనీలకు ప్రధాన వ్యాపార ప్రాంతాలైన పశ్చిమ దేశాల్లో అనిశ్చిత పరిస్థితుల్ని ఈ గైడెన్స్ ప్రతిబింబిస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున డివిడెండ్ను సిఫార్సు చేసింది. డివిడెండ్ చెల్లింపునకు జూన్ 2 రికార్డు తేదీగా నిర్ణయించారు.
ముగిసిన ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31తో పోలిస్తే ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,46,845 నుంచి 3,43,234కు తగ్గింది. అలాగే వలసల రేటు 20.9 శాతానికి తగ్గినట్టు కంపెనీ తెలిపింది.