న్యూఢిల్లీ, జూన్ 24: భారత్లో మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ వచ్చే నాలుగేండ్లలో జోరుగా వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఏడాదికి 8.8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధిచెందుతూ 2026 సంవత్సరానికల్లా విలువ రూ.4.30 లక్షల కోట్లకు చేరుతుందని పీడబ్ల్యూసీ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. దేశీ మార్కెట్లో ఇంటర్నెట్ సేవలు, మొబైల్ డివైజ్లు వ్యాప్తిచెందడంతో పాటు డిజిటల్ మీడియా వృద్ధికి నేతృత్వం వహిస్తుందని, సాంప్రదాయ మీడియా క్రమ వృద్ధిని కనపరుస్తుందన్నది. ‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్లుక్ 2022-26’ పేరుతో విడుదలైన నివేదికలో కీలకాంశాలు…
భారత్లో మొత్తం వార్తా పత్రికల ఆదాయం 2.7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధిచెందుతూ 2026 నాటికి రూ.29,945 కోట్లకు చేరుతుంది. 2021లో ఇది రూ.26,378 కోట్లు. ఫ్రాన్స్, యూకేలను వెనక్కునెట్టి 2026లో భారత్ ఐదో పెద్ద న్యూస్పేపర్ మార్కెట్గా ఎదుగుతుంది. అలాగే ప్రపంచంలోని ప్రింట్ న్యూస్పేపర్ల అమ్మకాలు కేవలం ఇండియాలోనే వృద్ధి చెందుతాయన్నది. డెయిలీ ప్రింట్ న్యూస్పేపర్ల సగటు అమ్మకాలు 1.3 శాతం చొప్పున వృద్ధిచెందుతూ 2026కల్లా 13.9 కోట్లకు చేరతాయని పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఈ సంఖ్య ప్రపంచంలో డెయిలీ ప్రింట్ వార్తా పత్రికల్లో మూడో వంతు అని, మొత్తం కాపీల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న చైనాను 2025కల్లా ఇండియా అధిగమిస్తుందన్నది.