Passenger Vehicles Exports | కరోనా తర్వాత రోజురోజుకు పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు 46 శాతం పెరిగాయి. వాటిల్లో మారుతి సుజుకి అగ్రస్థానంలో కొనసాగుతున్నదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. 2020-21 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 2,91,170 కార్లు ఎగుమతి చేస్తే ఈ ఏడాది 4.24.037 కార్ల ఎగుమతి జరిగింది. వీటిల్లో సుమారు 1.68 లక్షల కార్లు మారుతి సుజుకివే. ప్యాసింజర్ కార్ల ఎగుమతుల్లో 45 శాతం గ్రోత్తో 2,75,728 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. యుటిలిటీ వెహికిల్స్ ఎగుమతులు 47 శాతం పెరిగి 1,46,688 యూనిట్లకు చేరాయి. వ్యాన్ల ఎగుమతులు దాదాపు రెట్టింపయ్యాయి. 2020-21 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 877 వ్యాన్లు ఎగుమతి అయితే, ఈ ఏడాది 1621 వ్యాన్లు ఎగుమతి చేశారు.
వివిధ దేశాలకు కార్ల ఎగుమతిలో మారుతి సుజుకి సారధ్యం వహిస్తుండగా, తర్వాతీ స్థానాల్లో హ్యుండాయ్ మోటార్స్ ఇండియా, కియా ఇండియా నిలిచాయి. మారుతి సుజుకి 1,67,964 ప్యాసింజర్ వెహికల్స్ను ఎగుమతి చేసింది. 2020-21తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2020-21లో 59,821 కార్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. వీటితోపాటు 1,958 సూపర్ క్యారీ (ఎల్సీవీ) ఎగుమతి చేసింది.
లాటిన్ అమెరికా, ఏషియాన్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంతోపాటు ఇరుగు పొరుగు దేశాలకు మారుతి సుజుకి కార్లలో ఐదు మోడల్స్ ఎక్కువగా ఎగుమతి అయ్యాయి. ఎగుమతైన మోడల్స్లో బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బ్రెజా ఉన్నాయి. మారుతి సుజుకి కార్పొరేట్ ఎఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి మాట్లాడుతూ రెండేండ్ల క్రితం ఎగుమతులు పెంచాలని నిర్ణయించిందన్నారు. గత ఏప్రిల్-డిసెంబర్ మధ్య 1,69,922 ప్యాసింజర్ వెహికల్స్ ప్లస్ ఎల్సీవీలను ఎగుమతి చేశామన్నారు.
ఇదొక్కటే కాదు. 2021లో మారుతి సుజుకి 2,05,450 కార్లను ఎగుమతి చేసిందని రాహుల్ భారతి తెలిపారు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఇది అత్యధికం అని పేర్కొన్నారు. నాణ్యత, టెక్నాలజీ, విశ్వసనీయత, పనితీరు, కాస్ట్ ఎఫెక్టివ్నెస్లో ప్రపంచస్థాయి కస్టమర్ల విశ్వాసాన్ని మారుతి సుజుకి చూరగొన్నదని చెప్పారు.
గత తొమ్మిది నెలల్లో హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎగుమతులు 35 శాతం పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య 1,00,059 కార్లను ఎగుమతి చేసినట్లు హ్యుండాయ్ మోటార్స్ ఇండియా తెలిపింది. కియా మోటార్స్ 2020-21లో 28,538 కార్లు ఎగుమతి చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో 34,341 కార్లు ఎక్స్పోర్ట్ చేసింది. ఫోక్స్ వ్యాగన్ ఇండియా 29,796 కార్లు ఎగుమతి చేసింది.
2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కార్ల ఎగుమతులు 1,36,016 యూనిట్ల నుంచి 1,39,363 యూనిట్లకు పెరిగాయి. అయితే, 2020 డిసెంబర్తో పోలిస్తే గత నెలలో ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2020 డిసెంబర్లో 57,050 కార్లు ఎగుమతి చేయగా, గత నెలలో స్వల్పంగా తగ్గి 54,846 యూనిట్లకు పరిమితం అయ్యాయి.