హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో డ్రై పోర్టుల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయని టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి దుబాయ్ ఎక్స్పోలో తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో రాష్ట్రంలో 1,400 ఎకరాల్లో డ్రై పోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలోనే దుబాయ్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటూ నర్సింహారెడ్డి ఆహ్వానించారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగిన నేపథ్యంలో ఎగుమతులకూ అపార అవకాశాలున్నాయని చెప్పారు. దుబాయ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో భాగంగా గురువారం టీఎస్ఐఐసీ, ఎఫ్టీసీసీఐ, సీఐఐ ప్రతినిధుల బృందం దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీసీసీఐ) ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై డీసీసీఐ దృష్టి సారించాలని కోరారు. ఈ సమా వేశంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పలువురు పాల్గొన్నారు.
బియ్యం ఎగుమతులు పెంచుతాం
తెలంగాణ నుంచి జీసీసీ (గల్ఫ్ కో-ఆపరేటివ్ కంట్రీ) మార్కెట్కు బియ్యం ఎగుమతులను పెంచేందుకూ చర్యలు తీసుకుంటున్నామని నర్సింహారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డ్తో చర్చలు సైతం జరిపినట్లు తెలిపారు.