Trump Tariffs | వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన ‘ల్రాండోమాట్’ వ్యాఖ్యలను కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తప్పుపట్టారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఇంధన వాణిజ్య విధానం ప్రపంచ మార్కెట్ను స్థిరంగా ఉంచడంలో.. ధరలను నియంత్రించడంలో సహాయపడిందని ఆయన స్పష్టం చేశారు. లాండ్రోమాట్ అంటే అనుమానాస్పద వస్తువులను చట్టబద్ధంగా కనిపించేలా చేసే ప్రక్రియ లేదంటే ప్రదేశం అని అర్థం. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడికి చాలా కాలం ముందు నుంచే భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా ఉందని.. యుద్ధం తర్వాత కూడా భారతదేశం ఎగుమతులు.. లాభాలు దాదాపు అలాగే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
భారత్ రష్యన్ చమురు కోసం ‘లాండ్రోమాట్’గా మారిందని కొందరు ఆరోపిస్తున్నారని.. దీనికంటే తప్పు మరొకటి ఉండదని ఆయన ఓ వ్యాసంలో పేర్కొన్నారు. ‘ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారతదేశం రష్యన్ చమురు దిగుమతి ఒక శాతం నుంచి 40శాతం పెరిగింది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల తర్వాత.. భారతదేశం భారీ తగ్గింపుతో చమురును తీసుకుంటుంది. భారత్ చౌకగా ఇంధనాన్ని పొందుతుంది’ అంటూ ట్రంప్ పరిపాలన విమర్శించింది. రష్యన్ చమురును శుద్ధి చేసి యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసి భారత్ లాభాలను ఆర్జిస్తోందని ఆరోపించింది. అయితే, పీటర్ నోవారో గత వారంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణించారు. భారత్.. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘యుద్ధ యంత్రం’కి నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ఇరాన్, వెనిజులా లాగా రష్యన్ చమురుపై ప్రత్యక్ష నిషేధం లేదని పూరి పేర్కొన్నారు. G-7, యూరోపియన్ యూనియన్ రష్యన్ చమురుపై ధరల పరిమితి వ్యవస్థను విధించాయని, ఇది చమురు సరఫరాను కొనసాగించడం, రష్యా ఆదాయాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. భారత్ ప్రతి లావాదేవీలు చట్టబద్ధమైనవని స్పష్టం చేశారు. భారత్ చట్టబద్ధమైన షిప్పింగ్, భీమా, సర్టిఫైడ్ వ్యాపారులు, పరీక్షించిన మార్గాల ద్వారా మాత్రమే వ్యాపారం చేసిందన్నారు.
భారతదేశం ఏ నియమాలను ఉల్లంఘించలేదని, కానీ ప్రపంచ మార్కెట్ను స్థిరీకరించడంతో పాటు ధరలు పెరుగకుండా నిరోధించిందన్నారు. బ్రోకరేజ్ సంస్థ CLSA ఇటీవల ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ.. భారత్ రష్యన్ చమురు దిగుమతిని ఆపివేస్తే.. ముడి చమురు ధరలు బ్యారెల్కు 90 నుంచి 100 డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. రష్యన్ చమురు కొనుగోలుదారులు పరిమితంగా ఉన్నందున, భారత్ ఉపసంహరించుకోవడం వల్ల ప్రపంచ సరఫరా ఒక శాతం తగ్గవచ్చని.. ఇది ధరలు, ద్రవ్యోల్బణం రెండింటినీ పెంచుతుందని.. దశాబ్దాలుగా భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తి ఎగుమతిదారుగా ఉందని.. శుద్ధి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా చమురును ప్రాసెస్ చేస్తాయని పూరి అన్నారు. ఎగుమతులు సరఫరా గొలుసును కొనసాగిస్తున్నాయని ఆయన అన్నారు. రష్యా నుంచి చమురు నిషేధం తర్వాత.. యూరప్ కూడా భారతదేశం నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నది. భారతదేశ ఎగుమతి, శుద్ధి మార్జిన్లలో పెద్ద మార్పు లేదని.. కాబట్టి లాభాల ప్రశ్నే తలెత్తలేదన్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ ధరలు పెరిగిన సమయంలో భారత్ తన పౌరులకు ఉపశమనం కలిగించడానికి అనేక చర్యలు తీసుకుందని పూరీ స్పష్టం చేశారు.