మారుతీ సుజుకీ ఆందోళన
న్యూఢిల్లీ, మే 4: కరోనా సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ర్టాల్లో విధించిన లాక్డౌన్లు, కర్ఫ్యూలు కొనసాగితే తమ వాహనాల ఉత్పత్తికి విఘాతం కలగడం ఖాయమని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) అభిప్రాయపడింది. ఇదే గనుక జరిగితే తమ సేల్స్ ఔట్లెట్లను మూసేయాల్సి వస్తుందని ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ ఉద్ధృతి వల్ల ఎదురవుతున్న అవాంతరాలతో ఉత్పత్తికి ఎంత మేరకు విఘాతం కలుగుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని, మరికొన్ని రోజులు వేచిచూసిన తర్వాతే దీనిపై అవగాహనకు రావడం సాధ్యమవుతుందని అన్నారు. సెకండ్ వేవ్లో కొవిడ్-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా ఎంఎస్ఐ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకు సాగగలదని ఏప్రిల్ 27న భార్గవ చెప్పినప్పటికీ ఆ మరుసటి రోజే పరిస్థితి మారిపోయింది. వాహనాల తయారీకి ఉపయోగించే ఆక్సిజన్ను వైద్యపరమైన అవసరాలకు మళ్లించే ప్రక్రియలో భాగంగా హర్యానాలోని తన రెండు మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను మే 1 నుంచి 9 వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు గత నెల 28న ఎంఎస్ఐ ప్రకటించింది.