న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరించేందుకు వీలు కల్పించే బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 29 నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పీఎస్యూ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేయాలంటే 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టాలతోపాటు, 1949 బ్యాంకింగ్ నియంత్రణల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021ను లోక్సభలో ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటీకరించబోయే రెండు బ్యాంకుల పేర్లు బిల్లులో ఉండవని, ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటీకరించేందుకు వీలు కల్పించేదే ఈ బిల్లు అని అధికారులు వివరించారు.
ప్రైవేటీకరణకు సంబంధించిన సమాచారమేదీ తమకు ప్రభుత్వం నుంచి అందలేదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ)లు బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపాయి. ఈ రెండు బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేయనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ విషయమై ఆర్థిక శాఖ నుంచి లేదా భారత ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని ఐవోబీ, సీబీఐలు స్పష్టంచేశాయి. ఈ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తారన్న వార్తలతో ఈ రెండింటి షేర్లూ 10 శాతంపైగా పెరిగాయి. షేరు పెరగడానికి స్పెక్యులేషన్ కారణం కావొచ్చని ఐవోబీ ఎక్సేంజీలకు వివరణ ఇచ్చింది.